అక్షరటుడే నిజామాబాద్ క్రైం : Excise Department | నగరం నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి (Excise Superintendent Mallareddy) గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Excise Department | కంఠేశ్వర్ బైపాస్ వద్ద..
పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు గురువారం ఉదయం నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ (Kanteshwar Bypass) సమీపంలోని రిలయన్స్ మార్ట్ వద్ద ఎక్సైజ్ సీఐ స్వప్న (Excise CI Swapna) ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో 10కేజీల ఎండు గంజాయిని సరఫరా చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం దేవల తండాకు చెందిన పూజా పనార్, ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) కుప్పి గ్రామానికి చెందిన బాయ్ జాదవ్, నాందేడ్ జిల్లా కిన్వట్కు చెందిన కిషన్ మోతిరామ్ గాలే, మహారాష్ట్రలోని ఉమర్ కేడ్ చెందిన ఇంద్రజిత్ టార్గె, కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ గ్రామానికి చెందిన మంజ వెంకట్రామ్లను అరెస్టు చేశారు.
Excise Department | ఇద్దరు మహిళల ద్వారా..
ఇద్దరు మహిళలు కలిసి మధ్యప్రదేశ్లోని సిర్పూర్ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి నుండి గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం బస్లో నిర్మల్ వచ్చి నిర్మల్ నుండి నిజామాబాద్కు (Nizamabad) బస్లో వచ్చి.. రిలయన్స్ మార్ట్ వద్ద ముగ్గురు వ్యక్తులకు గంజాయి అప్పగిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇతర వ్యక్తుల నుంచి గంజాయి కిలోకు రూ.15,000 చొప్పున కొనుగోలు చేసి నిజామాబాద్లో రూ.20,000 చొప్పున అమ్ముతామని మహిళలు తెలిపారు. సమావేశంలో ఎక్సైజ్ పోలీసులు సుమిత, సునీల్, ప్రభాకర్, రవి, సంగయ్య, సౌమ్య, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
