అక్షరటుడే, బాన్సువాడ : Banswada | తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
వర్ని మండలం హుమ్నాపూర్, బోధన్ మండలం(Bodhan Mandal) బెల్లాల్కు చెందిన పలువురు మహారాష్ట్రలోని పాలజ్ గణేష్ మందిరానికి(Palaj Ganesh Temple) వెళ్లారు. తిరిగి వస్తుండగా వీరి కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది. నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్ తరోడ్ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదంలో వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామానికి(Humnapur Village) చెందిన ఇద్దరు, బోధన్ మండలం బెల్లాల్కు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. చేకూరి బుల్లి రాజు (50), అతని భార్య సునీత ( 45), వాణి (38) మృతి చెందగా గున్నం చంద్రశేఖర్ (35), నీలిమ (45)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్, బైంసా ఆస్పత్రులకు తరలించారు. రోడ్డు ప్రమాదంతో దంపతులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.