అక్షరటుడే, కోటగిరి: Kotagiri | కాంగ్రెస్ ప్రభుత్వం గత సీజన్లో ఇచ్చి హామీ మేరకు సన్నరకం వడ్లకు బోనస్ చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోతంగల్ (pothangal) మండల కేంద్రంలో వారు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. గత రబీ సీజన్లో రైతులకు ఇస్తామని ప్రకటించిన రూ.500 బోనస్ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల డిక్లరేషన్లో (Election Declaration) ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి నెలకొని ఉందని రైతులు పేర్కొన్నారు. ఇటీవల భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం చెల్లించి, దెబ్బతిన్న వరిధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో (Paddy Centers) రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని.. ధాన్యానికి తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు కిలోల తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా డీటీ అజీజ్ రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు.
సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. అనంతరం రైతులంతా కలిసి డీటీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు, కల్లూరి హన్మాండ్లు (బజరంగ్) ప్రకాష్ పటేల్, పబ్బా శేఖర్, గంగాధర్ పటేల్, సుబ్బు, రాజు పటేల్, వెంకటి, రాజు, మారుతి, మక్కయ్య, నాగనాథ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.