Farmers Protest
Farmers Protest |ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ ఎదుట పెట్రోల్​ బాటిళ్లతో రైతుల ఆందోళన

అక్షరటుడే, వెబ్​డెస్క్: Farmers Protest | రాష్ట్రంలో రైతులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. పలువురు రైతులు ఫారెస్ట్​ భూములను (forest lands) ఆక్రమిస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను అధికారులు లాక్కుంటున్నారని రైతులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. అయితే తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​ క్యాంపు కార్యాలయం (Bellampalli MLA Gaddam Vinod camp office) ఎదుట రైతులు పెట్రోల్​ డబ్బాలతో ఆందోళన నిర్వహించారు.

మంచిర్యాల జిల్లా (Mancherial district) నెన్నెల మండల కేంద్రానికి చెందిన కొందరు రైతులు ఆదివారం ఎమ్మెల్యే వినోద్​ కార్యాలయానికి వచ్చారు. 20 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములను అధికారులు ఫారెస్ట్ ల్యాండ్స్​ అంటున్నారని పేర్కొన్నారు. అంతేగాకుండా తాము సాగు చేసిన పత్తి మొక్కలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు, ఫారెస్ట్​ అధికారులు వచ్చి తమను భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట పెట్రోల్​ బాటిళ్లతో నిరసన తెలిపారు. పోలీసులు వారిని సముదాయించి పంపించి వేశారు.