అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | తెలంగాణలో శనివారం నుంచి భారీ వర్షాలు (Heavy Rains) పడతాయని వాతావరణ శాఖ అధికారులు (IMD) తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా వరుణుడు శాంతించాడు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడినా.. భారీ వర్షాలు లేవు. దీంతో కొంతకాలంగా వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఊరట చెందారు. కానీ మళ్లీ వర్షాలు పడతాయని అధికారులు చెబుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. శనివారం ఉదయం నుంచే వాతావరణం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, జనగామ, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రాత్రి పూట వర్షాలు పడతాయి.
Weather Updates | హైదరాబాద్ నగరంలో..
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం తర్వాత భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది.
Weather Updates | ఆంధ్ర ప్రదేశ్లో..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్తో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా భారీ వానలు పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంశధార నది ఉధృతంగా పారుతోంది. శ్రీకాకుళం (Srikakulam) జిల్లా సుసరాం గ్రామంలో పొలాలు నీట మునిగాయి. విజయనగరం, మన్యం జిల్లాల్లో సైతం వాన పడుతున్నాయి.
Weather Updates | ముంచుకొస్తున్న శక్తి తుపాన్
అరేబియా (Arebia) సముద్రంలో తుపాన్ ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రంలో ఈశాన్యం వైపు ద్వారకకు 240 కి.మీ, పోర్బందర్కు 270 కి.మీ దూరంలో ఏర్పడిన అల్పపీడనం తుపాన్గా మారింది. దీనికి సైక్లోన్ శక్తి (Cyclone Shakti) అని పేరు పెట్టారు. దీని ప్రభావంతో మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలపై శక్తి తుపాన్ ఎఫెక్ట్ అంతగా ఉండే అవకాశం లేదు.
Weather Updates | రైతుల్లో ఆందోళన
నాలుగు రోజులుగా వానలు లేకపోవడంతో అన్నదాతలు (Farmers) వరికోతలు ప్రారంభించారు. ముందస్తుగా సాగు చేసిన గ్రామాల్లో ప్రస్తుతం కోతలు ఊపందుకున్నాయి. అయితే వాతావరణం మేఘావృతమై ఉండటం, వర్షాలు పడతాయని అధికారులు చెబుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వడ్లు ఎండబెట్టి వాటి దగ్గరే కాపలా ఉంటున్నారు. ఇప్పటికే వర్షాలతో పంట దిగుబడి తగ్గిందని, మళ్లీ వానలు పడితే వడ్లు తడిసిపోయి మరింత నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.