అక్షరటుడే, హైదరాబాద్: Fake Certificate : ఓ వైపు ఇంజినీరింగ్ విద్య కోర్సుల పేరుతో ఫీజుల రూపంలో తల్లిద్రండులను కళాశాలలు లూఠీ చేస్తున్నాయి. మరోవైపు వారి టార్గెట్ కోసం విద్యార్థులను ఆయా సబ్జెక్టులలో ఫెయిల్ చేయడం ద్వారా బ్యాక్లాగ్లు ఉంచుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
ఇవన్నీ భరించి బయటకు వచ్చి ఉద్యోగం అందుకుందామంటే.. ఫేక్ సర్టిఫికెట్స్ తో కొందరు అడ్డదారుల్లో వీరి కొలువులను కాజేసి, విద్యార్థుల జీవితాలను రోడ్డున పడేస్తున్నారు.
ఇలా ఫేక్ సర్టిఫికెట్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిపోవడంతో కొందరు అక్రమార్కులు భారీ మోసానికి తెర లేపారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఏకంగా సర్టిఫికెట్స్ దుకాణమే పెట్టేశారు. డబ్బులు ఇస్తే.. ఏ కోర్సు సర్టిఫికెట్ కావాలన్నా క్షణాల్లో తయారు చేసి ఇచ్చేస్తారు. అమీర్పేట్ Ameerpet, దిల్సుఖ్నగర్ Dilsukhnagar, కేపీహెచ్బీ KPHB.. ఏరియా ఏదైనా ఎక్కడో ఒక మూలన కన్సల్టెన్సీ పేరుతో ఇలాంటి అక్రమ దందాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
Fake Certificate : ముఠా గుట్టు రట్టు..
కూకట్పల్లి (Kukatpally)లో నకిలీ సర్టిఫికెట్స్ రూపొందించే ముఠా గుట్టును తాజాగా సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు, విదేశాల్లో కొలువు, ఉన్నత చదువుల కోసం వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకున్న కొందరు కూకట్పల్లిలో ఏకంగా ఫేక్ సర్టిఫికెట్స్ దుకాణం తెరిచారు. ఈ దుకాణానికి శ్రీ వ్యాస్ కన్సల్టెన్సీ పేరు పెట్టారు. అభ్యర్థల అవసరాలను లక్ష్యంగా చేసుకుని, అక్రమార్జనకు తెరలేపారు.
వీరి అక్రమాలు తారాస్థాయికి చేరి, బయటకు పొక్కడంతో చివరికి పోలీసులకు చిక్కారు. పక్కా సమాచారంతో సైబరాబాద్ పోలీసులు సదరు కన్సల్టెన్సీలో సోదాలు చేపట్టారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Fake Certificate : ఏ సర్టిఫికెట్ అయినా సిద్ధం..
పోలీసుల కథనం ప్రకారం.. ఫేక్ సర్టిఫికెట్ నిందితులను A.హరీష్, M.మహేష్గా గుర్తించారు. వీరు కుకట్పల్లిలో శ్రీ వ్యాస్ కన్సల్టెన్సీ పేరుతో కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఫారెట్ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్స్, మార్కుల పట్టాలు ప్రింట్ చేసి ఇస్తున్నారు. అవి ఎలా ఉంటాయంటే.. అచ్చం ఒరిజినల్ మాదిరే ఉంటాయి. వీరు రూపొందించిన సర్టిఫికెట్స్ ను ఒరిజినల్ వాటి పక్కన పెట్టి పోల్చితే గుర్తుపట్టడం కష్టం. అంత పక్కాగా సర్టిఫికెట్స్ రూపొందించడం వీరి నైపుణ్యమనే చెప్పాలి.
Fake Certificate : విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం..
వీరి దుకాణంలో పోలీసులు సోదాలు చేపట్టగా.. కుప్పలు తెప్పలుగా నకిలీ సర్టిఫికెట్లు లభించాయి. దీంతో వాటితోపాటు, సెల్ ఫోన్లు, కీలకమైన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులు ఇప్పటివరకు 46 మందికి ఫేక్ సర్టిఫికెట్స్ జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో 24 మంది ఇప్పటికే ఫారెన్ వెళ్లిపోయినట్లు తేలింది.
సదరు నిందితులకు విజయవాడ Vijayawada కు చెందిన మోహన్ ఈ నకిలీ సర్టిఫికెట్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం మోహన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.