అక్షరటుడే, వెబ్డెస్క్ : Fake Apple products | మార్కెట్లో యాపిల్ (Apple) సంస్థకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. యాపిల్ బ్రాండ్ సామగ్రి కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. ధర ఎంతయినా ఆలోచించకుండా కొనుగోలు చేస్తారు. అయితే యాపిల్ యాక్సెసరీస్కు మార్కెట్లో ఉన్న డిమాండ్ను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. నకిలీ యాపిల్ ప్రోడక్ట్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు.
హైదరాబాద్లోని (Hyderabad) మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. రూ.3 కోట్ల విలువైన డూప్లికేట్ యాపిల్ యాక్సెసరీస్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇర్ఫాన్ అలీ, షాహిద్ అలీ, సంతోష్ రాజ్ పురోహిత్లను అరెస్ట్ చేశారు. వీరు ముంబైలోని ఏజెంట్ల నుంచి నకిలీ యాపిల్ సామగ్రి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు.
Fake Apple products | స్టిక్కర్లు అతికించి విక్రయం
నిందితులు ముంబై నుంచి డూప్లికేట్ యాపిల్ వాచ్లు, ఎయిర్ పాడ్స్, పవర్ బ్యాంకులు, కేబుళ్లు కొనుగోలు చేస్తున్నారు. వాటికి యాపిల్ స్టిక్కర్లు, లోగోలు అతికించి హైదరాబాద్లో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం పోలీసులు వారిపై దాడి చేశారు. రూ.మూడు కోట్ల విలువ చేసే యాపిల్ యాక్సెసరీస్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2,761 నకిలీ ఉత్పత్తులు టాస్క్ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. యాపిల్ ప్రతినిధులతో కలిసి పోలీసులు ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఇతర కంపెనీల వస్తువులతో పోలిస్తే యాపిల్ ప్రోడక్టులకు ధర అధికంగా ఉంటుంది. అయినా చాలా మంది వీటిని కొనుగోలు చేస్తారు. అయితే నకిలీ యాపిల్ ఉత్పత్తుల స్కాం వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రూ.వేలు పెట్టి తాము కొనుగోలు చేసిన యాపిల్ సామగ్రి అసలుదా.. నకిలీదా అని ఆలోచిస్తున్నారు. బ్రాండ్, నాణ్యత కోసం చాలా మంది యాపిల్ యాక్సెసరీస్ కొనుగోలు చేస్తారు. అయితే ఈ నిందితులు హైదరాబాద్లో ఎన్ని కోట్ల విలువైన నకిలీ వస్తువులు విక్రయించారో పోలీసుల విచారణలో తేలనుంది.