HomeతెలంగాణLocal Body Elections | స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ.. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్​

Local Body Elections | స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ.. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్​

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది. దీనిపై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ వీడటం లేదు. ఎన్నికల సంఘం షెడ్యూల్​ విడుదల చేసినా.. ఎన్నికలు జరుగుతాయా.. లేదా అనే ఆందోళన నెలకొంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోకు వ్యతిరేకంగా మాధవరెడ్డి అనే వ్యక్తి ఇప్పటికే హైకోర్టు (High Court)లో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 8కి విచారణను వాయిదా వేసింది. ఈ లోపే ఎన్నికల సంఘం (Election Commission) ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్​ విడుదల చేసింది. అయితే షెడ్యూల్​​ వెలువడినా.. విచారణ చేపడుతామని కోర్టు స్పష్టం చేసింది. తాజాగా మరో వ్యక్తి బీసీ రిజర్వేషన్ల (BC Reservations)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు.

Local Body Elections | 6వ తేదీకి వాయిదా

బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా వంగా గోపాల్​ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్​ వేశారు. 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడం చట్ట విరుద్ధమని ఆయనప పేర్కొన్నారు. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన ధర్మాసనం సోమవారానికి (ఈ నెల 6వ తేది) వాయిదా వేసింది. దీంతో రిజర్వేషన్లపై కోర్టులు ఎలాంటి తీర్పు ఇస్తాయోనని పోటీ చేయాలనుకునే ఆశావహులు, ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గవర్నర్​ వద్ద బిల్లు పెండింగ్​లో ఉండగా జీవో ఎలా జారీ చేస్తారని ఇప్పటికే హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Local Body Elections | రద్దు చేస్తే ఎలా..

రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు షెడ్యూల్​ విడుదల చేసింది. రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మూడు దశల్లో సర్పంచ్​ ఎలక్షన్లు పెడతామని తెలిపింది. ఈ నెల 9న ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడనుంది. ఆ రోజు నుంచి తొలిదశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు కూడా స్వీకరిస్తారు. అయితే కోర్టులు ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తే ఎలా అనే ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఆయా స్థానాలకు రిజర్వేషన్​ ఖరారు చేశారు. ఆ ప్రకారం ఆశావహులు గ్రామాల్లో పోటీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

ఒక వేళ కోర్టులు 42 శాతం రిజర్వేషన్​ చెల్లదని తీర్పు ఇస్తే.. మొత్తం రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. దీంతో చాలా మంది పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు సందిగ్ధంలో పడిపోయారు. అయితే నోటిఫికేషన్​ వెలువడటానికి ముందే సుప్రీంకోర్టు, హైకోర్టులో విచారణ ఉండటంతో ఆలోపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.