అక్షరటుడే, వెబ్డెస్క్ : SBI ATM | దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్ల నుంచి మొదలు పెడితే బ్యాంకుల వరకు దేనిని వదలడం లేదు. తాజాగా ఆదిలాబాద్ (Adilabad) పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎం (SBI ATM)లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి దొంగలు చొరబడ్డారు. సీసీ కెమెరాలకు బ్లాక్ స్పే కొట్టారు. అనంతరం గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషన్ను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఏటీఎంలో ఎంత నగదు పోయిందనే వివరాలు తెలియరాలేదు. క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
SBI ATM | ఇటీవల హైదరాబాద్లో..
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో (Jeedimetla) సైతం దొంగలు ఇటీవల ఇదే తరహాలో ఏటీఎంలను చోరీ చేశారు. జీడిమెట్లలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ఏటీఎం సెంటర్లో జులై 8న అర్ధరాత్రి దొంగలు చోరీ చేశారు. గ్యాస్ కట్టర్తో మూడు ఏటీఎం మిషన్లను ధ్వంసం చేసి రూ.34 లక్షలు ఎత్తుకెళ్లారు. కాగా.. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు. హర్యానాకు చెందిన ముఠా ఈ చోరీ చేసినట్లు గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్లోనూ అదే తరహాలో చోరీ జరగడంతో హర్యానా ముఠా పనేనా.. లేక ఇతరులు చేశారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో ఇందల్వాయిలో సైతం ఓ ఏటీఎంలో దొంగలు చోరీ చేశారు.