
అక్షరటుడే, వెబ్డెస్క్ : IND vs ENG Test | ఓవల్ మైదానం వేదికగా ప్రారంభమైన ఇంగ్లండ్- భారత్ ఐదో టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ఓలీ పోప్ (Captain Oli Pope) బౌలింగ్ ఎంచుకున్నాడు. నాలుగో టెస్ట్లో బెన్ స్టోక్స్ (Ben Stokes) గాయపడడంతో ఈ మ్యాచ్కు ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అయితే వరుసగా 15 మ్యాచ్లలో టీమిండియా టాస్ ఓడి కొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సిరీస్లో మొత్తం ఐదు మ్యాచులు జరగగా, ఐదింట్లోనూ గిల్ టాస్ ఓడిపోయాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి వరుసగా టీమిండియా 15 టాస్లను ఓడిపోవడం గమనార్హం. క్రికెట్ చరిత్రలో ఇదో కొత్త రికార్డు అని అంటున్నారు.
IND vs ENG Test | భారీ మార్పులతో..
క్రికెట్ చరిత్రలో ఓ జట్టు వరుసగా అన్ని సార్లు టాస్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న గిల్ (Shubhman Gill).. ఇంగ్లండ్తో జరిగిన అయిదు టెస్టుల్లో టాస్ ఐదు సార్లు ఓడాడు. అంతకముందు అంతర్జాతీయ మ్యాచుల్లో ఇండియా రెండు టీ20, 8 వన్డేల్లోనూ టాస్ను కోల్పోవడం విశేషం అయితే 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఓ జట్టు అన్నింటిలో టాస్ను కోల్పోవడం ఇది 14వ సారి అని రికార్డులు చెబుతున్నాయి. ఇక భారత జట్టు(Team India) నాలుగు కీలక మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించారు.
శార్దూల్ ఠాకూర్ స్థానంలో కరుణ్ నాయర్, బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ, అలాగే అన్షుల్ కాంబోజ్ స్థానంలో ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టులో గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్లు జట్టులోకి చేరారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే యశస్వి జైస్వాల్ వికెట్ను కోల్పోయింది. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (14) రాంగ్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్ (25 ), శుభ్మన్ గిల్ (15 ) ఉన్నారు. లంచ్ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-2 తేడాతో వెనుకబడింది. దీంతో ఐదో టెస్టు టీమిండియాకు India ఎంతో కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీస్ను సమం చేయొచ్చు. ఒకవేళ మ్యాచ్ డ్రా అయినా ఇంగ్లండ్ జట్టే సిరీస్ను కైవసం చేసుకుంటుంది.