అక్షరటుడే, హైదరాబాద్: Private Engineering Colleges | తెలంగాణలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో (private engineering colleges) మేనేజ్మెంట్ సీట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. టాప్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) (ఏఐఎంఎల్) (డేటా సైన్స్) సీట్ల కోసం ఎంత ఫీజు అయినా చెల్లించేందుకు తల్లిదండ్రులు వెనుకాడట్లేదు. ఈ డిమాండ్ను కళాశాలల యాజమాన్యాలు (College managements) సొమ్ము చేసుకుంటున్నాయి. మేనేజ్మెంట్ సీట్లను (management seats) రూ.లక్షల్లో విక్రయించుకుంటూ దండుకుంటున్నాయి. కాలేజీ యాజమాన్యం రూ.లక్షల్లో దోచుకుంటే.. సందట్లో సడేమియా అన్నట్లు కళాశాల సిబ్బంది రూ. వేలల్లో దోచుకుంటున్నారు. వీరు తమ కింద బ్రోకర్లను నియమించుకుని, వారికి కొంత ఇస్తూ.. మిగతాది అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు.
మేనేజ్మెంట్ కోటాలో (management quota) ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సులకే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. తెలంగాణలోని 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో (engineering colleges) 1.18 లక్షల సీట్లున్నాయి. వీటిల్లో 60 శాతానికి పైగా కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులవే కావడం గమనార్హం.
గతేడాది రాష్ట్రంలో మొత్తం 1,07,160 ఇంజినీరింగ్ సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటాలో 79,224, మేనేజ్మెంట్ కోటాలో 27,936 సీట్లు భర్తీ అయ్యాయి. కాగా.. హైదరాబాద్లోని(Hyderabad) టాప్ 10, 20 కాలేజీల్లోని మేనేజ్మెంట్ సీట్లకే అత్యధికంగా డిమాండ్ ఉంటోంది. ఇదే అదనుగా ఈ కళాశాలల యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటా (management quota) సీట్లను భారీ మొత్తానికి అమ్ముకొంటున్నాయి.
ఇంజినీరింగ్ సీట్ల భర్తీలో బీ కేటగిరి(మేనేజ్మెంట్ కోటా) సీట్ల వాటా ఏటా పెరుగుతూ వస్తోంది. మొత్తం సీట్లలో 30 శాతం మేనేజ్మెంట్ కోటా (management quota) కింద భర్తీ చేసే అవకాశం ఉంది. ఈఏపీసెట్ ర్యాంక్(EAP CET rank) ఆధారంగా కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద సీట్లను భర్తీ చేస్తున్నారు. కాగా, ఈఏపీసెట్లో 25 వేల ర్యాంకు దాటితే, టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం లేదు. కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సుల్లో సీటు రావాలంటే 10 వేలలోపు ర్యాంకు రావాల్సి ఉంటుంది.
సీఎస్ఈ వంటి టాప్ కోర్సులు (top courses) చేయాలనుకునే వారికి మంచి కళాశాల్లో సీట్లు పొందడం కష్టంగా మారింది. దీంతో, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడడం లేదు. ఈ కారణంతోనే మేనేజ్మెంట్ కోటా సీఎస్ఈ అనుబంధ కోర్సుల్లోని సీట్లను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విక్రయించుకుంటున్నట్లు సమాచారం. సెకండరీ కళాశాలల్లోనూ రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు దోచుకుంటున్నారు.
Private Engineering Colleges | బీ కేటగిరీ సీట్లకు పెరుగుతున్న డిమాండ్
మేనేజ్మెంట్ కోటా సీట్ల (management quota seats) భర్తీ ఏటా పెరుగుతూ వస్తోంది. 2022లో 20,238 మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 22,103కి చేరుకుంది. గతేడాది(2024) ఏకంగా 28 వేలకు చేరుకుంది. ఇలా ఏటా డిమాండ్ పెరుగుతూ వస్తోంది.
Private Engineering Colleges | ఈసారి పెరగనున్న 15 వేల సీట్లు..
2014లో రాష్ట్ర విభజన అనంతరం.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, పదేళ్ల పాటు తెలంగాణలోని(Telanagan) ప్రొఫెషనల్ కోర్సులలో 85% సీట్లను స్థానిక విద్యార్థులతో, 15% సీట్లను ఏపీ విద్యార్థులతో (Students) భర్తీ చేసేవారు. ఈ 10 ఏళ్ల గడువు 2024లో ముగియడంతో.. తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 27, 2025న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు (Andhra Pradesh students) ప్రత్యేక కోటాను రద్దు చేస్తూ GO MS No. 15 జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఈసారి వంద శాతం తెలంగాణ విద్యార్థులతో (Telangana students) ఇంజినీరింగ్ సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. అంటే స్థానిక విద్యార్థులకు దాదాపు 15 వేలకు పైగా ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అంటే వీటిని కూడా ఈఏపీసెట్ ద్వారా ఆయా కేటగిరీల కింద స్థానిక విద్యార్థులకే భర్తీ చేయనున్నారు.
ఇటీవల(2025) తెలంగాణలో నిర్వహించిన ఇంజినీరింగ్ (Engineering), అగ్రికల్చర్ (Agriculture), ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET)కు మొత్తం 2,07,190 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం 1,51,779 మంది అర్హత సాధించారు. అంటే 73.26 % అర్హత పొందారు. కాగా, ఈ పరీక్ష రాసిన విద్యార్థుల్లో తెలంగాణ స్థానిక విద్యార్థుల సంఖ్య ఎంత అనేది అధికారికంగా గణాంకాలు లేవు.
Private Engineering Colleges | సర్కారు నియంత్రణ ఏది..?
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో (private engineering colleges) డొనేషన్ల వసూళ్లపై ప్రభుత్వం నియంత్రణ అనేది లేకుండా పోయింది. ఈ సమస్య ఒకటి ఉందంటూ ప్రతి సంవత్సరం సాధారణ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తోందనే సోయి ప్రభుత్వ పెద్దలకు లేకపోవడం దురదృష్టకరం.
Private Engineering Colleges | ప్రైవేటు వర్సిటీల్లోనూ సీట్లకు పెరుగుతున్న డిమాండ్
ప్రైవేట్ యూనివర్సిటీలు (Private Universities) స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2018లో తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం, ప్రైవేట్ యూనివర్సిటీలు 25% సీట్లను స్థానిక విద్యార్థులకు (local students) కేటాయించాలి. ఈ యూనివర్సిటీలు వివిధ రంగాల్లో, ముఖ్యంగా ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ఆర్ట్స్, సైన్స్, డిజైన్, ఆర్కిటెక్చర్ వంటి కోర్సులను అందిస్తున్నాయి.
రాష్ట్రంలో పది ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిల్లోని సీట్లకు సైతం డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో వర్సిటీల యాజమాన్యాలు రోజుకో ఫీజు ప్రకటిస్తూ.. తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని వర్సిటీలైతే ఏకంగా రూ. లక్షల్లో డొనేషన్లు సైతం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఏమీ చేయాలో అర్థం కాక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.
అటు కాలేజీలు, యూనివర్సిటీలు (Private Universities) చెప్పే ఫీజులు చెల్లించే స్తోమత లేనివారు తమ పిల్లలు భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటున్నారు. పూర్తిగా దిగాలు పడిపోతున్నారు. ఒకవేళ ధైర్యం చేసి వీటిల్లో సీటు కొనుగోలు చేయాలన్నా.. అంత పెద్ద మొత్తంలో అప్పు పుట్టే పరిస్థితి లేకపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
- కామారెడ్డికి (Kamareddy) చెందిన ఓ విద్యార్థికి ఎంసెట్(ఈఏపీఎస్)లో ర్యాంకు రాలేదు. దీంతో తల్లిదండ్రులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో (private engineering college) కంప్యూటర్ సైన్స్ బ్రాంచికి సంబంధించి మేనేజ్మెంట్ సీటు కొనుగోలు చేయాలని భావించారు. కాలేజీ వారిని సంప్రదిస్తే.. రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో వాళ్లని, వీళ్లని బ్రతిమిలాడి, కాళ్లావేళ్లా పడి రూ.8 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఇందుకు కాలేజీ సిబ్బందితో పాటు మధ్యవర్తులుగా వర్తించిన వారికి రూ.50 వేలు చెల్లించుకున్నారు.
- మెదక్కు చెందిన ఓ అమ్మాయి పేరెంట్స్ హైదరాబాద్లోని ఉమెన్ ఇంజినీరింగ్ కళాశాలలో (Women Engineering College) సీటు కోసం రూ.14 లక్షలు ముట్టజెప్పారు. ఈ మొత్తాన్ని కూడా ఒకేసారి చెల్లించేందుకు తెలిసిన వారినల్లా అడిగి సర్దాల్సి వచ్చింది. ఆ విద్యార్థిని నాలుగేళ్లు చదువు పూర్తి చేసుకుని జాబ్ చేయడం దేవుడెరుగు. తమ పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఎలా అప్పులపాలు అవుతున్నారో ఈ ఘటన ఓ సాక్ష్యంగా నిలుస్తోంది.
Private Engineering Colleges | తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలు:
- అనురాగ్ యూనివర్సిటీ (Anurag University) – హైదరాబాద్
- మల్లారెడ్డి యూనివర్సిటీ (Malla Reddy University) – హైదరాబాద్
- మహీంద్రా యూనివర్సిటీ (Mahindra University) – హైదరాబాద్
- డబ్ల్యూ.ఓ.ఎక్స్.ఎస్.ఇన్ యూనివర్సిటీ (Woxsen University) – సదాశివపేట, సంగారెడ్డి జిల్లా
- ఎస్.ఆర్. యూనివర్సిటీ (SR University) – వరంగల్
- గురు నానక్ యూనివర్సిటీ (Guru Nanak University) – హైదరాబాద్
- శ్రీనిధి యూనివర్సిటీ (Sreenidhi University) – హైదరాబాద్
- ఎన్.ఐ.సి.ఎం.ఏ.ఆర్. యూనివర్సిటీ (NICMAR University) – హైదరాబాద్
- ఎమ్.ఎన్.ఆర్. యూనివర్సిటీ (MNR University) – హైదరాబాద్
- కావేరి యూనివర్సిటీ (Kaveri University) – సిద్దిపేట