అక్షరటుడే, వెబ్డెస్క్ : Earthquake | అఫ్గానిస్తాన్లో (Afghanistan) భారీ భూకంపంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 800 మంది మృతి చెందారు.
తూర్పు అఫ్గానిస్తాన్లోని కునార్ ప్రావిన్స్లో (Kunar Province) ఆదివారం రాత్రి రిక్టార్ స్కేల్పై 6.0 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 2,500 మంది గాయపడ్డారు. చౌకే, నుర్గల్, షిగల్, మనోగై జిల్లాలు భూకంపం (Earthquake) ధాటికి ప్రభావితం అయ్యాయి. దేశంలోని నంగర్హార్, లగ్మాన్, నురిస్తాన్ ప్రావిన్సులలో కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.
Earthquake | వరుస భూకంపాలు
యూఎస్ జియోలాజికల్ (US Geological) సర్వే ప్రకారం జలాలాబాద్ సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. 8 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 20 నిమిషాల తర్వాత ఇదే ప్రావిన్స్లో 4.5 తీవ్రతతో మళ్లీ భూకంపం వచ్చింది. భూకంపం ధాటికి పలు గ్రామాల్లో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద ఉన్న వారి కోసం అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Earthquake | ప్రధాని మోదీ విచారం
అఫ్గాన్లో భూకంపంపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. అఫ్గాన్ ప్రజలకు మానవతా సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.