అక్షరటుడే, వెబ్డెస్క్ : Eagle Team | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈగల్ టీమ్ పోలీసులు 220 కిలోల ఎఫిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.72 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
నగరంలో డ్రగ్స్ దందా ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు లభ్యం అవుతున్నాయి. ఈగల్ టీమ్, ఎస్వోటీ (SOT) పోలీసులు దాడులు చేస్తున్నా.. డ్రగ్స్ విక్రేతలు మాత్రం తమ దందా ఆపడం లేదు. దీంతో మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, పలువురు డాక్టర్లు సైతం డ్రగ్స్ తీసుకుంటూ గతంలో దొరికారు. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా నగరంలోని జీడిమెట్ల (Jeedimetla)లో ఈగల్ టీమ్ పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
Eagle Team | నలుగురి అరెస్ట్
నగరంలోని ఓ రసాయన పరిశ్రమలో ఎఫిడ్రిన్ డ్రగ్ తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.72 కోట్లు ఉంటుందని, దేశంలో అయితే రూ.10 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శివరామకృష్ణ అనే వ్యక్తి దీని తయారీలో ప్రధాన నిందితుడని చెప్పారు. డ్రగ్ తయారీకి వాడిన ఫార్ములాను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని తయారీకి బిగ్ స్కేల్ కెమికల్ యూనిట్ వినియోగించినట్లు గుర్తించారు.