అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. చాలా మంది యువత గంజాయి, డ్రగ్స్కు బానిసలు మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
నగరంలో యథేచ్ఛగా డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయి. ఈగల్ టీం (Eagle Team), ఎస్వోటీ పోలీసులు దాడులు చేపట్టి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా కూడా దందా ఆగడం లేదు. నగరంలో కొందరు బడాబాబులు, ప్రముఖుల కోసం ఇటీవల కాలంలో డ్రగ్స్, రేవ్ పార్టీలు (Rave Parties) నిర్వహిస్తున్నారు. తాజాగా గచ్చిబౌలిలో డ్రగ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోలివింగ్ గెస్ట్ రూంలో కొందరు డ్రగ్ పార్టీ నిర్వహిస్తుండగా.. ఎస్వోటీ పోలీసులు దాడులు (SOT police Raids) చేశారు.
Hyderabad | కర్ణాటక నుంచి..
డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. కర్ణాటక (Karnataka) నుంచి తెచ్చి హైదరాబాద్  (Hyderabad)లోని యువకులకు డ్రగ్స్ విక్రయిస్తున్న స్మగ్లర్ గుత్తా తేజకృష్ణతో పాటు మరో నైజీరియన్ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పార్టీలో ఎండీఎంఏతో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad | పెరుగుతున్న డ్రగ్ పార్టీలు
నగరంలో ఇటీవల డ్రగ్, రేవ్ పార్టీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ అయిన కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఇటీవల ఇటువంటి పార్టీలను పోలీసులు భగ్నం చేశారు. నగర శివారులోని ఫామ్హౌస్లు, రిసార్ట్లలో కూడా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పోలీసులు ఇలాంటి పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా నిర్వాహకులు మాత్రం పార్టీలు అరెంజ్ చేస్తుండటం గమనార్హం. ముఖ్యంగా కర్ణాటక, ఒడిశా నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం.
