అక్షరటుడే, వెబ్డెస్క్ : Randhir Jaiswal | పదేపదే ప్రేలాపనలకు దిగుతున్న పాకిస్తాన్కు భారత్ దీటైన హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Pakistan Army Chief Asim Munir) ఇటీవల అణుబాంబు బెదిరింపులకు దిగడం, సిందూ నదిపై ఆనకట్టలు కడితే పేల్చేస్తామని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. తన సొంత వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ నాయకత్వం నిర్లక్ష్యంగా, యుద్ధోన్మాదంగా, ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరంతరం చేస్తూనే ఉంది. వారి సొంత వైఫల్యాలను దాచడానికి భారత్పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ద్వారా పదే పదే రెచ్చగొట్టేందుకు యత్నిస్తోందని” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) అన్నారు.
Randhir Jaiswal | రెచ్చగొట్టడం ఆపకపోతే..
రణధీర్ జైస్వాల్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. పాక్ రెచ్చగొట్టడం ఆపకపోతే తగిన పరిణామాలు అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను (Operation Sindoor) గుర్తుంచుకోవాలని రణధీర్ జైస్వాల్ హెచ్చరించారు. అమెరికా పర్యటనలో మునీర్ చేసిన ప్రకటనను పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమర్థించిన నేపథ్యంలో మన విదేశాంగ శాఖ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. భారతదేశం(India) నుండి ఉనికికి ముప్పు ఎదురైతే ఇస్లామాబాద్ “సగం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది” అని మునీర్ హెచ్చరించారు. అయితే, ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి చాలా బాధ్యతారహితమైనవని, ప్రాంతీయ, ప్రపంచ భద్రతకు ముప్పు అని పేర్కొంది. ఉగ్రవాద గ్రూపులతో చేతులు కలిపిన సైనిక సంస్థ నుంచి ఇటువంటి బెదిరింపులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేసింది.
Randhir Jaiswal | సింధు జల ఒప్పందంపై..
సింధు జల (Indus River) ఒప్పందంపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అవార్డు చట్టబద్ధతను భారతదేశం ఎప్పుడూ అంగీకరించలేదని విదేశాంగ శాఖ పేర్కొంది. “కాబట్టి దాని ప్రకటనలు అధికార పరిధికి దూరంగా ఉన్నాయి, చట్టపరమైన హోదా లేదు. అందుకే సిందూ జలాలను ఉపయోగించుకునే హక్కులపై ఎటువంటి ప్రభావం చూపవు” అని జైస్వాల్ తెలిపారు. పాకిస్తాన్ “అవార్డు” అని పిలవబడే ఎంపిక చేసిన, తప్పుదారి పట్టించే కథనాలను ఇండియా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు. “జూన్ 27, 2025 నాటి మా పత్రికా ప్రకటనలో పునరుద్ఘాటించినట్లుగా, అనాగరికమైన పహల్గామ్ దాడితో సహా సరిహద్దు ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాకిస్తాన్(Pakistan) కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వ సార్వభౌమ నిర్ణయం ద్వారా సింధు జలాల ఒప్పందం నిలిపివేయబడింది” అని ఆయన అన్నారు.