Uttar Pradesh
Uttar Pradesh | తీవ్ర గాయాల‌తో చేరిన వ్య‌క్తికి వైద్యం చేయ‌కుండా ప‌డుకున్న వైద్యుడు.. తీవ్ర రక్త‌స్రావంతో మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీరట్‌లో (Meerut) తీవ్ర నిర్లక్ష్యానికి ఓ వ్య‌క్తి బలైన‌ ఘటన చోటుచేసుకుంది. లాలా లజపతిరాయ్ మెమోరియల్ (ఎల్ఎల్ఆర్ఎం) మెడికల్ కాలేజీలో (Lala Lajpat Rai Memorial Medical College) వైద్యుల నిర్ల‌క్ష్య‌ వైఖరి కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకురావడమే కాకుండా, అత్యవసర వైద్యసాయం కోసం కుటుంబ సభ్యులు వేడుకున్నప్పటికీ, విధుల్లో ఉన్న డాక్టర్ మాత్రం నిద్రలో మునిగి ఉండడం వ‌ల‌న ఆ వ్యక్తి క‌న్నుమూశాడు. వివ‌రాల‌లోకి వెళితే సోమవారం అర్ధరాత్రి (సుమారు ఒంటి గంట సమయంలో), 30 ఏళ్ల సునీల్ అనే యువకుడు బైక్‌పై ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

Uttar Pradesh | మ‌రీ ఇంత నిర్ల‌క్ష్య‌మా?

తీవ్రంగా గాయపడిన అతనిని కుటుంబ సభ్యులు వెంటనే ఎల్ఎల్ఆర్ఎం ఆసుపత్రి (LLRM hospital) ఎమర్జెన్సీ వార్డుకు తీసుకువచ్చారు. అయితే, అప్పటికే అతని కాలికి తీవ్ర గాయమవడంతో రక్తస్రావం అవుతుంది. బంధువులు ప్రాథమికంగా క్లాత్‌లు కట్టి రక్తస్రావం ఆపే ప్రయత్నం చేశారు. ఆసుపత్రిలో విధుల్లో ఉన్న జూనియర్ రెసిడెంట్ డాక్టర్ భూపేశ్ కుమార్ రాయ్ (Dr. Bhupesh Kumar Roy) ఏసీ వేసుకొని, కుర్చీపై కాళ్లు పెట్టుకొని నిద్రలో ఉండడం బంధువులను నిరాశకు గురి చేసింది. ఎంతగా వేడుకున్నా డాక్టర్ స్పందించలేదని వారు తెలిపారు. ఇతర సిబ్బందిని అభ్యర్థించినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో చివరకు సునీల్ తీవ్ర రక్తస్రావంతో మరణించాడు.

ఈ దారుణ ఘటనపై సునీల్ బంధువులు తీసిన వీడియోను సోషల్ మీడియాలో (Social media) షేర్ చేయడంతో వైరల్ అయింది. ఈ ఘటనపై స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ భూపేశ్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్ఎల్ఆర్ఎం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.సి.గుప్తా (RC Gupta) మాట్లాడుతూ.. “వీడియోను పరిశీలించిన వెంటనే చర్యలు తీసుకున్నాం. ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి, ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తున్నాం” అని తెలిపారు. ఈ ఘటన వైద్య రంగంలో ఉన్న నిర్లక్ష్యాన్ని మరోసారి బయటపెట్టింది. అత్యవసర పరిస్థితుల్లోనూ వైద్యులు బాధ్యత తీసుకోకపోతే ప్రాణాలు కోల్పోయే వారెందరో అన్న ఆవేదన ప్ర‌జ‌లలో ఉంది. వైద్యుడి నిర్ల‌క్ష్యం వ‌ల‌న ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.