అక్షరటుడే, వెబ్డెస్క్ : DK Shivakumar | కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అసెంబ్లీలో రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గీతాన్ని పాడటం కాంగ్రెస్ను చిక్కుల్లోకి నెట్టింది. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డీకే ఆర్ఎస్ఎస్ గీతం – నమస్తే సదా వత్సలే మాతృభూమి – ఆలపించారు.
అయితే, దీనిపై బీజేపీ(BJP) విమర్శలు ఎక్కుపెట్టింది. ఆర్ఎస్ఎస్ ను తీవ్రంగా విమర్శించే కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ(Rahul Gnadhi)ని ఆ పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదనేందుకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ పార్టీలోని కొందరు మాత్రమే ఆర్ఎస్ఎస్ ను విమర్శిస్తున్నారని, మిగతా వారంతా ప్రశంసిస్తున్నారని పేర్కొంది.
DK Shivakumar | బీజేపీ విమర్శలు..
అసెంబ్లీలో డీకే ఆర్ఎస్ఎస్ గీతం(RSS Anthem) పాడుతున్న వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శలు గుప్పించింది. 73 సెకన్లు ఉన్న ఈ వీడియోలో ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్ఎస్ఎస్ గీతం – నమస్తే సదా వత్సలే మాతృభూమి – పాడుతున్నట్లు ఉంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీజేపీకి సైద్ధాంతిక మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్పై డీకే గతంలో చేసిన వ్యాఖ్యపై బీజేపీ విమర్శించిన తర్వాత ఇది జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్పై విమర్శలు ఎక్కుపెట్టింది. కాంగ్రెస్ నాయకులలో చాలా మంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ను ప్రశంసిస్తున్నారని పేర్కొంది. “నమస్తే సదా వత్సలే మాతృభూమి… నిన్న కర్ణాటక అసెంబ్లీలో డీకే శివకుమార్(DK Shivakumar) ఆర్ఎస్ఎస్ గీతం పాడుతూ కనిపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కుటుంబ సన్నిహితులు ఇప్పుడు నేరుగా ఐసీయూ/కోమా మోడ్లోకి వెళ్లారు” అని బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి Xలో పేర్కొన్నారు.
DK Shivakumar | రాహుల్ను సీరియస్గా తీసుకోరు..
కాంగ్రెస్ పార్టీ(Congress Party)లోని అంతర్గత విభేదాలను తాజా ఘటనతో బయటపడ్డాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని ఎవరు కూడా తమ ఎంపీ రాహుల్ గాంధీని “సీరియస్గా” తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. “ప్రధాని మోదీ(Prime Minister Modi) ఎర్రకోట నుంచి ఆర్ఎస్ఎస్ సహకారం గురించి మాట్లాడిన తర్వాత, మెజారిటీ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ను ప్రశంసిస్తున్నారు. కాంగ్రెస్లో థరూర్(Shashi Tharoor) నుంచి డీకే శివకుమార్ వరకు ఎవరూ రాహుల్ను సీరియస్గా తీసుకోరు!” అని ఆయన పేర్కొన్నారు.
DK Shivakumar | స్పందించిన డీకే..
ఈ నేపథ్యంలో డీకే పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. దీనిపై డీకే స్పందిస్తూ తాను పుట్టుకతో కాంగ్రెస్లో ఉన్నానని, అందులోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. బీజేపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. “నేను పుట్టుకతోనే కాంగ్రెస్ వాదిని. ఒక నాయకుడిగా నా ప్రత్యర్థులను స్నేహితులను నేను తెలుసుకోవాలి. నేను వారి గురించి అధ్యయనం చేశాను. (బీజేపీతో) చేతులు కలిపే ప్రశ్నే లేదు. నేను కాంగ్రెస్కు నాయకత్వం వహిస్తాను. నేను పుట్టినప్పటి నుండి జీవితాంతం కాంగ్రెస్లోనే ఉన్నానని” తెలిపారు.