అక్షరటుడే, ధర్పల్లి: Dharpalli | ప్రజల సౌకర్యార్థం అత్యవసర సమయంలో ఫోన్ చేయడానికి పోలీస్ శాఖ (police department) డయల్ 100ను ప్రవేశ పెట్టింది. అయితే కొందరు దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. ఎలాంటి అవసరం లేకున్నా.. ఫోన్ చేసి సమయం వృథా చేస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
డయల్ 100ను దుర్వినియోగం చేసిన ఓ వ్యక్తి న్యాయస్థానం ఏడు రోజులపాటు జైలు శిక్ష విధించినట్లు ధర్పల్లి ఎస్సై కళ్యాణి (Dharpalli SI Kalyani) ఒక ప్రకటనలో తెలిపారు. రేకులపల్లి గ్రామానికి (Rekulapalli village) చెందిన గుజ్జుల రాజు అనే వ్యక్తి శనివారం అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో అనవసరంగా డయల్ 100కు కాల్ చేసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. దీంతో రాజుకు న్యాయస్థానం ఏడు రోజుల శిక్ష విధించినట్లు ఆమె వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే 100కు కాల్ చేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
