అక్షరటుడే, వెబ్డెస్క్ : Nepal | నేపాల్ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం (Himalayan country) అట్టుడికి పోయింది. సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి.
పరిస్థితులు చేయి దాటడంతో ప్రధాని కేపీ శర్మ ఓలి (Prime Minister KP Sharma Oli) రాజీనామా చేశారు. అయినప్పటికీ శాంతించని ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. సోషల్ మీడియాపై నిషేధం (Social Media Ban) ఎత్తేసినప్పటికీ ఆందోళనకారులు శాంతించలేదు. అవినీతి, బంధుప్రీతిపై ఆగ్రహంతో రెచ్చిపోయిన నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. సుప్రీంకోర్టు (Suprem Court), పార్లమెంట్ తో పాటు ప్రధాని, అధ్యక్షుడి ఇళ్లకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులను లూటీ చేశారు.
Nepal | రంగంలోకి దిగిన సైన్యం..
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి దిగింది. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నేపాలీ సైన్యం (Nepal Army), ఇతర భద్రతా సంస్థల అధిపతులు విజ్ఞప్తి చేశాయి. “ప్రధానమంత్రి రాజీనామాను అధ్యక్షుడు ఇప్పటికే ఆమోదించినందున, ఈ క్లిష్ట పరిస్థితిలో ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని అనుమతించవద్దని, సంయమనం పాటించాలని మేము అందరికీ పిలుపునిస్తున్నాము” అని సైన్యం ఓ ప్రకటనలో కోరింది. రాజకీయ చర్చల ద్వారా సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని సూచించింది. “చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం మాత్రమే శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ఏకైక మార్గం” అని తెలిపింది.
Nepal | కుప్పకూలిన ప్రభుత్వం.. ఆగని విధ్వంసం..
సోషల్ మీడియాపై విధించిన నిషేధం.. ఆ తర్వాత వెల్లువెత్తిన ఆందోళనలతో నేపాల్ ప్రభుత్వం పడిపోయింది. పాల్లో జెన్ జెడ్ యువత (Gen Z youth) ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు ప్రభుత్వాన్ని కూల్చేశాయి. ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. అవినీతి, బంధుప్రీతిని నిరసిస్తూ మరింత రెచ్చిపోయారు. లక్షలాది మంది నిరసనకారులు కాఠ్మాండ్లో విధ్వంసం సృష్టించారు. ప్రధాని ఓలి, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఇళ్లను ఆందోళన కారులు ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ (ప్రచండ) ఇంటిని కూడా ధ్వంసం చేశారు.
Nepal | వెంటాడి.. చితగ్గొట్టి..
పార్లమెంట్ భవనంపై (Parliament building) దాడి చేసి భవనాన్ని దహనం చేశారు. మాజీ ప్రధాని షేర్ బహాదుర్ దేవుబా, ఎనర్జీ మంత్రి దీపక్ ఖడ్కా ఇళ్లనూ నిరసనకారులు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాన మంత్రి కెపి శర్మ ఆయిల్ ఇంటికి నిప్పు పెట్టారు. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్ను ఖాట్మండు (Kathmandu) వీధుల్లో పరుగెత్తిస్తూ వెంటబడి కొట్టారు. 65 ఏళ్ల పౌడెల్ ఇంటిపై దాడి చేసి ఆయనను చితక్కొట్టారు. ఆయన తప్పించుకుని పరుగెడుతుండగా వెంటబడి మరీ దాడి చేశారు.
ఈ ఘటనలు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించడానికి దారి తీశాయి. రంగంలోకి దిగిన సైన్యం పరిస్థితులను చక్కదిద్దేందుకు యత్నిస్తోంది. మంత్రులను వీఐపీలను క్షేమంగా ఆర్మీ బ్యారక్ లకు తరలిస్తోంది. ఇందుకోసం హెలికాప్టర్లను వినియోగిస్తోంది. ఇప్పటికే త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (Tribhuvan International Airport) మూసి వేశారు. మరోవైపు, ప్రస్తుత పరిస్థితుల్లో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయన దుబాయ్ వెళ్లనున్నట్లు తెలిసింది.