అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలోని జేబీఎస్ (JBS) వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. బస్టాండ్ వద్ద దుకాణాలను అధికారులు తొలగించారు.
సికింద్రాబాద్ (Secunderabad) జేబీఎస్ బస్టాండ్ వద్ద కంటోన్మెంట్ బోర్డు (Cantonment Board) అధికారులు తెల్లవారుజామున నుంచే కూల్చివేతలు చేపట్టారు. కొంతమంది కంటోన్మెంట్ ల్యాండ్లో దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. కొన్నేళ్లుగా దుకాణాలు పెట్టుకొని బతుకుతున్నారు. అయితే ఆ దుకాణాలను తొలగించాలని గతంలో పలుమార్లు కంటోన్మెంట్ బోర్డు అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా దుకాణాల యజమానులు ఖాళీ చేయలేదు.
Hyderabad | భారీ బందోబస్తు..
నోటీసులకు దుకాణదారులు స్పందించకపోవడంతో కంటోన్మెంట్ బోర్డు అధికారులు బుధవారం తెల్లవారుజామున నుంచి కూల్చివేతలు చేపట్టారు. భారీ బందోబస్తు మధ్య జేసీబీ (JCB)లతో దుకాణాలను తొలగించారు. సీఈవో మధుకర్ నాయక్తోపాటు అధికారులు కూల్చివేతలను పర్యవేక్షించారు. ఎలాంటి ఆందోళనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కొద్ది నెలలుగా కూల్చివేతలు చేపడుతారని దుకాణాదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు స్థానిక నాయకుల ద్వారా కూల్చివేతలు చేపట్టకుండా ఆపాలని ప్రయత్నాలు చేశారు. అయితే కంటోన్మెంట్ అధికారులు దుకాణాలను తొలగించారు. దుకాణాల యజమానులు ఆందోళనలు చేపట్టే అవకాశం లేకుండా తెల్లవారుజామున 5 గంటలకు కూల్చివేతలను ప్రారంభించారు.
అధికారులు మాట్లాడుతూ.. కంటోన్మెంట్కు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసుకొని దుకాణాలు పెట్టారన్నారు. వాటిని అద్దెకిస్తూ ఆదాయం పొందుతున్నారని చెప్పారు. ఆయా దుకాణాలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పక్కనే ఉన్న నాలాలో సైతం వారు చెత్త వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై తమకు ఫిర్యాదులు రావడంతో కూల్చివేతలు చేపట్టామన్నారు. జాయింట్ సీఈవో పల్లవి తదితరులు పాల్గొన్నారు.