అక్షరటుడే, వెబ్డెస్క్ : Delhi Terror Plot Busted | ఢిల్లీలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన అంతర్జాతీయ ఉగ్ర నెట్వర్క్ను ఢిల్లీ పోలీసులు (Delhi Police) ఛేదించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ నుంచి ఎనిమిది మంది అనుమానితులను అరెస్ట్ చేసి, విదేశీ హ్యాండ్లర్ల ప్రమేయంపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ఆదివారం నిర్వహించిన మెరుపు దాడుల్లో తమిళనాడు (Tamilnadu), పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది. వీరి వెనుక విదేశీ హ్యాండ్లర్ల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మధ్య కాలంలో ఢిల్లీ మెట్రో పరిసర ప్రాంతాలు, నగరంలోని కీలక కేంద్రాల్లో కశ్మీర్ అంశంపై రెచ్చగొట్టే పోస్టర్లు వెలిశాయి. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సంచలన విషయాలు గుర్తించారు. పోస్టర్ల మూలాలను వెతుక్కుంటూ వెళ్లగా తమిళనాడులోని తిరుప్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న టెర్రర్ మాడ్యూల్ బయటపడింది.
Delhi Terror Plot Busted | నకిలీ పత్రాలతో నివాసం
తమిళనాడులోని గార్మెంట్ కంపెనీల్లో కార్మికులుగా పనిచేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని పశ్చిమ బెంగాల్లో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మిజానూర్ రెహ్మాన్, మహమ్మద్ షాబత్ సహా పలువురు బంగ్లాదేశ్ (Bangladesh) పౌరులు ఉన్నట్లు సమాచారం. వీరు నకిలీ ఆధార్ కార్డులతో భారత్లో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లలోని డేటాను విశ్లేషిస్తూ ఈ ముఠాకు సంబంధాలు ఉన్న వ్యక్తులు, నిధుల మూలాలు, విదేశీ లింకులపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు భారత్లో పెద్ద స్థాయి ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితులను ఢిల్లీకి తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ అరెస్టులతో దేశవ్యాప్తంగా నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల పారిశ్రామిక ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించినట్లు సమాచారం.
