అక్షరటుడే, వెబ్డెస్క్ : Registrations | రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో అనేక సంస్కరణలు చేపట్టింది. ముఖ్యంగా వేగవంతమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంది.
కేవలం పది నిమిషాల నుంచి అరగంట వ్యవధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా మార్పులు తీసుకు వచ్చింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (Sub-Registrar’s offices) ఇది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. దీంతో డాక్యుమెంట్ల కోసం వచ్చిన వారు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
నిజామాబాద్ (Nizamabad) అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక్కడ ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నప్పటికీ డాక్యుమెంట్ల కోసం వచ్చిన వారు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. బుధవారం పెద్ద మొత్తంలో డాక్యుమెంట్ల కోసం ఆన్లైన్ స్లాట్లు రాగా.. ప్రక్రియ పూర్తి చేసేందుకు చాలా సమయం పట్టింది. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిప్పలు పడ్డారు. పది నిమిషాల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ.. తాము గంటల తరబడి కార్యాలయాల్లోనే వేచి ఉండాల్సి వస్తోందని పలువురు చెప్పుకొచ్చారు.
Registrations | చర్యలు చేపట్టాలి
టెక్నాలజీ పరంగా రిజిస్ట్రేషన్ల శాఖ మార్పులు తీసుకొచ్చినప్పటికీ ఫలితం ఉండడం లేదు. స్లాట్కు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగాల్సి ఉన్నా.. అందుకు విరుద్ధంగా సబ్ రిజిస్ట్రార్లు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డాక్యుమెంట్ల కోసం వచ్చిన వారు కోరుతున్నారు.