అక్షరటుడే, వెబ్డెస్క్ : Pak Saudi | పాకిస్తాన్, సౌదీ అరేబియా పరస్పర రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. రెండు దేశాలపై జరిగే ఏదైనా దాడిని “ఇరు దేశాలపై దాడి”గా పరిగణిస్తామని రెండు వర్గాలు ప్రకటించాయి.
సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. సెప్టెంబర్ 9న ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత అరబ్ లీగ్(Arab League), ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) మధ్య అసాధారణ ఉమ్మడి సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం జరిగింది.
Pak Saudi | పరస్పర రక్షణకు
రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. ఏ దేశంపై జరిగినా మరో దేశంపై దాడి జరిగినట్లుగానే భావిస్తామని పాకిస్తాన్(Pakistan), సౌదీ పేర్కొన్నాయి. తాజా ఒప్పందం రెండు దేశాల మధ్య పరస్పర సహకారం, నిబద్ధతను చాటుతుందని పేర్కొన్నాయి. “ఈ ఒప్పందం తమ భద్రతను పెంపొందించుకోవడానికి, ఈ ప్రాంతంతో పాటు ప్రపంచంలో భద్రత, శాంతిని సాధించడానికి రెండు దేశాల ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది, రెండు దేశాల మధ్య రక్షణ సహకారం అంశాలను అభివృద్ధి చేయడం, దురాక్రమణకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది” అని ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. “ఏ దేశానికి వ్యతిరేకంగా జరిగే ఏదైనా దురాక్రమణను ఇద్దరిపై దాడిగా పరిగణించాలని ఒప్పందం పేర్కొంది” అని తెలిపాయి.
Pak Saudi | స్పందించిన భారత్.
పాకిస్తాన్, సౌదీ అరేబియా(Saudi Arabia) ఒప్పందంపై భారత్ ఆచితూచి స్పందించింది. ఈ పరిణామం మన జాతీయ భద్రతకు, అలాగే ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వానికి కలిగే ప్రభావాలను అధ్యయనం చేస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) అన్నారు. దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి, అన్ని రంగాలలో సమగ్ర జాతీయ భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. “సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిసింది. రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక ఒప్పందాన్ని అధికారికం చేసే ఈ పరిణామం పరిశీలనలో ఉందని ప్రభుత్వానికి తెలుసు. ఈ పరిణామం మన జాతీయ భద్రతకు, అలాగే ప్రాంతీయ స్థిరత్వానికి కలిగించే ప్రభావాలను అధ్యయనం చేస్తాము. దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి, అన్ని రంగాలలో సమగ్ర జాతీయ భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని జైస్వాల్ స్పష్టం చేశారు.