అక్షరటుడే, వెబ్డెస్క్ : pashamylaram | సిగాచి పరిశ్రమ (Sigachi Factory) పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. సంగారెడ్డి (Sangareddy) జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో (Sigachi Factory) ఇటీవల భారీ పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో 34 మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరి ఆచూకీ దొరకలేదు. తాజాగా మృతుల సంఖ్య 43కు చేరింది.
పరిశ్రమలో పేలుడు దాటికి గాయపడిన వారిలో 38 మంది మృతి చెందినట్లు కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చికిత్స పొందుతూ పలువురు మృతి చెందారు. తాజాగా ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జితేందర్ అనే వ్యక్తి చనిపోయాడు. అలాగే ఆచూకీ లేని తొమ్మిది మందిలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 43కు చేరింది. మరో ఏడుగురి ఆచూకీ ఇంకా లభించలేదు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
pashamylaram | కంపెనీపై కేసు నమోదు
సిగాచి పరిశ్రమ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఎన్నో కలలతో నగరానికి వలస వచ్చి బతుకుతున్న కార్మికుల కుటుంబాల్లో ఈ పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రభుత్వం రూ.లక్ష చొప్పున పరిహారం అందజేసింది. అలాగే సిగాచి పరిశ్రమ మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారంతో పాట ఇతర బీమా క్లెయిమ్లు అందజేస్తామని తెలిపింది.
పేలుడు దాటికి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా మారిపోవడంతో అధికారులు డీఎన్ఏ పరీక్షలు చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. అయితే ఏడుగురి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.