అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | నిత్యం తాను పనిచేసేందుకు వెళ్లే వండ్రింగి షాప్నకు కొద్దిదూరంలోనే ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. బస్సు రూపంలో మృత్యుడు ఆయనను కబలించింది.
స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి (tadwai) మండలం బ్రాహ్మణపల్లి (Brahmanpalli) గ్రామానికి చెందిన పైడాకుల నారాయణ (52) కామారెడ్డి పట్టణంలోని ధర్మశాల సమీపంలో రెడీమేడ్ డోర్స్ తయారీ షాపులో (Readymade Doors) పని చేస్తున్నాడు.
ప్రతి రోజూ మాదిరిగానే తన టీవీఎస్ ఎక్సెల్పై (TVS Excel) ఇంటినుంచి కామారెడ్డికి బయలుదేరాడు. రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న తన షాప్నకు రెండు నిమిషాల్లో చేరుకునే సమయంలో వెనకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఎక్సెల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు ఘటనా స్థలానికి వచ్చి బోరున విలపించారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic jam) కావడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.