అక్షరటుడే, వెబ్డెస్క్ : Asia Cup | ఆసియా కప్లో భాగంగా భారత్–శ్రీలంక మధ్య నిన్న రాత్రి జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.
మ్యాచ్ చివర్లో విన్నూత్న పరిణామాల నేపథ్యంలో, శ్రీలంక ఆటగాడు దాసున్ శనక(Dasun Shanaka) రనౌట్ అయినప్పటికీ నాటౌట్గా ప్రకటించబడటం, అభిమానుల్లో గందరగోళాన్ని కలిగించింది. ఇన్నింగ్స్ టై అయిన తర్వాత మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న వేళ, భారత బౌలర్ అర్షదీప్ సింగ్ నాలుగో బంతి వేస్తున్న సమయంలో, అసలైన డ్రామా ఆరంభమైంది. దాసున్ శనక ఆ బంతిని ఆడడంలో విఫలమై ముందుకు పరిగెత్తాడు, వికెట్ కీపర్ సంజూ శాంసన్ బంతిని అందుకొని స్టంప్స్ను విసిరేశాడు.
Asia Cup | వీటి వెనుకు ఉన్న కారణం ఏంటి?
బౌలర్ మరియు కీపర్ క్యాచ్ ఔట్ కోసం అప్పీల్ చేయడంతో, అంపైర్ గాజీ సోహెల్(Umpire Ghazi Sohel) వేలెత్తి ఔట్గా ప్రకటించారు. అదే సమయంలో శనక పరుగు తీయడానికి ప్రయత్నించడంతో, శాంసన్ స్టంప్స్ విసిరాడు. అప్పటికి శనక చాలా దూరంలో ఉండటంతో, అతను క్లియర్ రనౌట్ అయినట్లు కనిపించింది. నిబంధనల ప్రకారం అది రనౌట్ ఎందుకు కాదు? అంటే ఐసీసీ నిబంధన ప్రకారం .. ఔట్గా ప్రకటించిన వెంటనే బంతి ‘డెడ్ బాల్’(Dead Ball)గా మారుతుంది. దీనివల్ల ఆ తర్వాత జరిగిన రనౌట్ చెల్లదు. శనక రివ్యూ కోరడంతో, అల్ట్రా ఎడ్జ్ ద్వారా బంతి బ్యాట్కు తగలలేదని నిర్ధారణ అయింది. అంపైర్ తాను ఇచ్చిన ఔట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ అప్పటికే బంతి డెడ్ బాల్ అయిపోయినందున, రనౌట్ని పరిగణించలేదు. కాని తర్వాతి బౌల్కే శనక క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
మరోవైపు భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) బౌలింగ్ లో పతుమ్ నిస్సాంక బలంగా కొట్టిన షాట్ లాంగ్-ఆన్ వైపు దూసుకువెళ్ళగా, బంతి అక్షర్ పటేల్ చేతిలో పడి నేరుగా బౌండరీ లైన్ దాటిపోయింది. శ్రీలంక ఆటగాళ్లు, ప్రేక్షకులు ఇది సిక్స్ అనుకుని సంబరాలు మొదలుపెట్టే సమయంలో అంపైర్ దానిని డెడ్ బాల్గా ప్రకటించారు. దానికి కారణం ఏంటంటే భారత ఓపెనర్ అభిషేక్ శర్మ గాయం కారణంగా మైదానం నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఇది జరిగింది. ఏ ఆటగాడు అయిన పూర్తిగా బౌండరీ లైన్ను దాటి మైదానం నుంచి బయటకు వెళ్లే వరకు అతని స్థానంలో రిప్లేస్మెంట్ ఫీల్డర్ మైదానంలోకి వచ్చే వరకు, ఆ బంతిని వాలీడ్ డెలివరీ(Valid Delivery)గా పరిగణించరు. ఈ క్రమంలోనే ఆ బాల్ని డెడ్ బాల్గా ప్రకటించారు.