అక్షర టుడే, ఆర్మూర్ : Jeevan Reddy | కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు వచ్చాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలిపి పదేళ్లలో కేసీఆర్ తెచ్చిన స్వర్ణయుగం.. కాంగ్రెస్ రాబంధుల పాలవుతుందని ఎవరూ ఊహించలేదన్నారు. తెలంగాణ (Telangana) స్వరాష్ట్రంగా మారి బానిసత్వ శక్తుల కబంధ హస్తాల నుంచి బయటపడిన సంతోషం పదేళ్లలోనే మాయమైందని విమర్శించారు.
Jeevan Reddy | ఇందిరమ్మ రాజ్యం పేరిట బానిసత్వం..
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇందిరమ్మ రాజ్యం పేరుతో బానిసత్వం, అణచివేత పాలన సాగిస్తోందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో మోసాలు కొనసాగిస్తూ ప్రజలను గోస పెడుతోందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అవినీతి, బీజేపీ దుర్నీతికి తెలంగాణ ప్రయోగశాలగా మారిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు తెలంగాణను నిలువునా దోపిడీ చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు కప్పం కడుతున్నారన్నారు. బీజేపీ తెలంగాణ పట్ల దుర్నీతి ప్రదర్శిస్తూ తెలంగాణపై పగ పెంచుకుని దగా చేస్తోందంటూ విమర్శలు చేశారు. తెలంగాణకు దక్కాల్సిన సెమీకండక్టర్ పరిశ్రమ ఏపీకి తరలించి తెలంగాణ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన బీజేపీకి (BJP) తెలంగాణలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. తెలంగాణపై మోదీ సర్కారు (Modi Government) వివక్షపై నోరు విప్పని రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల వైఖరి సిగ్గుచేటని ఆయన విమర్శించారు. కాంగ్రెస్–బీజేపీ నిజస్వరూపాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలను తరిమికొట్టేందుకు ప్రజలంతా మరో సంగ్రామానికి సంసిద్ధులు కావాల్సిన సమయం ఆసన్నమైందని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.