అక్షరటుడే, వెబ్డెస్క్ : Bandi Sanjay | తెలంగాణ రాజకీయ నేతలను కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. మావోయిస్టు (Maoist)లతో సంబంధాలు ఉంటే తెంచుకోవాలన్నారు.
మావోయిస్టులతో పలువురు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయని ఇటీవల సరెండర్ అయిన మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్రావు (Mallojula Venugopal Rao) తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో సంబంధం ఉన్న నేతలు వెంటనే తెంచుకోవాలని సూచించారు. లేకపోతే వారి బండారం బయటపెడతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. కాగా.. మల్లోజుల తెలిపినట్లు రాష్ట్రంలో మావోయిస్టులతో సంబంధాలున్న నాయకులు ఎవరా అనే చర్చ నడుస్తోంది.
Bandi Sanjay | కేంద్రం నిఘా ఉంది
మావోయిస్టులు వర్గాలుగా విడిపోయారని, అందులో ఓ వర్గం తెలంగాణ రాజకీయ నేతలతో కుమ్మక్కు అయిందని మల్లోజుల తెలిపినట్లు ఓ జాతీయ దినపత్రికలో కథనం వచ్చింది. దీనిని ట్యాగ్ చేస్తూ బండి సంజయ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని ప్రబోధిస్తూ సాయుధ నెట్వర్క్లకు మద్దతు ఇస్తున్నారని చెప్పబడుతున్నవారు, మీ సంబంధాలను తెంచుకోండి లేదా బయటపడండి’’ అని ఆయన అన్నారు.
అవినీతి, మాఫియా, తీవ్రవాదంపై కేంద్రం నిఘా ఉందని పేర్కొన్నారు. ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో ఆగదని, వారి వెనక ఉన్నవారిని సైతం వదలదని స్పష్టం చేశారు. దేశ అంతర్గత భద్రతా విషయాల్లో తప్పు వైపు నిలబడితే కూలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు.