అక్షరటుడే, వెబ్డెస్క్ : Nepal | జెన్ – జడ్ విధ్వంసంతో అల్లకల్లోలంగా మారిన నేపాల్ సర్దుకుంటోంది. శాంతిభద్రతలు అదుపులోకి రావడంతో సైన్యం కర్ఫ్యూ ఎత్తివేసింది. శనివారం ఉదయం 5:00 గంటల నుంచి ఖాట్మండు(Kathmandu)లో నిషేధాజ్ఞలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
సోషల్ మీడియాపై నిషేధం(Social Media Ban)తో మొదలైన నిరసనలు అవినీతి, బంధు ప్రీతికి వ్యతిరేకంగా భారీ ఉద్యమానికి దారి తీశాయి. ఈ నేపథ్యంలో యువత, విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. ప్రధాని రాజీనామా చేసినప్పటికీ శాంతించలేదు. రంగంలోకి దిగిన సైన్యం(Nepal Army) నిరసనకారులతో చర్చలు జరిపింది. అధ్యక్షుడు ప్రభుత్వాన్ని రద్దు చేయగా, జెన్-జడ్ మద్దతున్న సుశీల కర్కీ(Sushila Karki) తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తరువాత సైన్యం కర్ఫ్యూను ఉపసంహరించుకుంది. అయితే, ముందు జాగ్రత్త చర్యగా మరికొన్ని ప్రాంతాల్లో సైన్యం పహారా కొనసాగుతుందని తెలిపింది
Nepal | జన జీవనం సాధారణం
ఎటువంటి కర్ఫ్యూ, ఆంక్షలు లేకపోవడంతో శనివారం సాధారణ జనాలు రోడ్లపైకి వచ్చారు. రోజుల తరబడి మూసివేయబడిన దుకాణాలు, మార్కెట్లు. మాల్స్ తిరిగి తెరుచుకున్నాయి. వాహనాలు రోడ్లపై తిరిగి కనిపించడం ప్రారంభించాయి. ఆందోళనకారులు తగలబెట్టబడిన వాహనాలు, ప్రభుత్వ భవనాల్లో పారిశుధ్య చర్యలు జరుగుతున్నాయి.
Nepal | మార్చిలోగా సార్వత్రిక ఎన్నికలు
ఆరునెలల్లో ఎన్నిలు నిర్వహించనున్నట్లు తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. 2026 మార్చి 5వ తేదీ కంటే ముందు సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది. స్థిరత్వం, ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా అంతర్గత రాజకీయ చర్చల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
Nepal | ప్రధానిని కలిసిన భారత రాయబారి
అధ్యక్ష భవనం (శీతల్ నివాస్)లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే.. నేపాల్(Nepal)లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ(Indian Ambassador Naveen Srivastava) తాత్కాలిక ప్రధానమంత్రి సుశీలా కర్కిని కలిసిన మొదటి విదేశీ దౌత్యవేత్త అయ్యారు. ఈ సమావేశంలో, రాయబారి శ్రీవాస్తవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) నుంచి అభినందన సందేశాన్ని అందజేశారు. ఈ పరివర్తన కాలంలో నేపాల్కు సహాయం చేయడంలో భారతదేశం పూర్తి మద్దతు ఉంటుందని ఆమెకు హామీ ఇచ్చారు. దీంతో ఆమె ఇండియాకు, ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. భారత్తో బలమైన సహకారం కోసం ఎదురు చూస్తున్నట్లు ఆమె చెప్పారు. భారతదేశం ఎప్పటిలాగే నేపాల్ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం తనకుందని తెలిపారు.