అక్షరటుడే, వెబ్డెస్క్ : CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బార్బడోస్లో ఇద్దరు క్రికెటర్లు, ఒక లీగ్ అధికారి(League Officer)పై దుండగులు తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటన క్రికెట్ ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది.
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు, ఒక సీపీఎల్ అధికారి సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 3 గంటల సమయంలో ఒక ప్రైవేట్ ఈవెంట్ (Private Event) ముగించుకుని హోటల్కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మధ్యలో ఆహారం కోసం ఆగినప్పుడు కొందరు దుండగులు వారిని చుట్టుముట్టి తుపాకీతో (Gun) బెదిరించారు. ఆటగాళ్ల వద్ద ఉన్న నగలు, విలువైన వస్తువులను దోచుకున్నారు.
CPL | పోలీసులు రంగంలోకి..
ఈ సమయంలో ఒక దుండగుడి తుపాకీ కిందపడిపోయింది. సమాచారం అందుకున్న బార్బడోస్ పోలీసులు (Barbados Police) వెంటనే అక్కడికి చేరుకుని ఆ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదృష్టవశాత్తు ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ఆటగాళ్లు, అధికారి తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
ఈ ఘటనపై పేట్రియాట్స్ ఫ్రాంచైజీ స్పందిస్తూ.. “మా ఆటగాళ్లు, అధికారి సురక్షితంగా ఉన్నారు. పోలీసుల విచారణకు మేము పూర్తిగా సహకరిస్తున్నాం” అని తెలిపింది. సీపీఎల్ CPL ప్రతినిధి కూడా బాధితుల క్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యం అని పేర్కొన్నారు. విచారణ కొనసాగుతున్నందున బాధితుల పేర్లు గోప్యంగా ఉంచారు. ఈ సంఘటన అనంతరం పేట్రియాట్స్ జట్టుకు (Patriots Team) భద్రతను మరింత పెంచారు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 11న కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో బార్బడోస్ రాయల్స్తో పేట్రియాట్స్ తలపడనుంది. ఏది ఏమైన తాజాగా జరిగిన సంఘటన అందరు ఉలిక్కిపడేలా చేసింది.