అక్షరటుడే, కామారెడ్డి : CPI | సీపీఐ (CPI) స్థాపించి డిసెంబర్ 26 నాటికి వందేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఖమ్మంలో సంబరాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) తెలిపారు.
జిల్లా కేంద్రంలోని మున్నూరుకాపు సంఘ భవనంలో బుధవారం నిర్వహించిన జిల్లా మూడో మహాసభలో మాట్లాడారు. ఖమ్మంలో నిర్వహించే ముగింపు వేడుకలకు దేశవ్యాప్తంగా 5 లక్షల మంది తరలి రానున్నారని, జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా పార్టీలో కొనసాగుతూ అమరులైన నాయకులకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఐ అధికారం కోసం పాకులాడలేదని, నీతి, నిజాయితీ ఉన్న పార్టీలు మనుగడ సాగిస్తాయన్నారు. బీజేపీ దేవుడు, మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
బీజేపీ (BJP) లాంటి పెద్ద శత్రువును ఎదుర్కొవాలంటే కాంగ్రెస్తో స్నేహం చేయాల్సి వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టారని, ఎవరి సొమ్ము ఎవరు అనుభవించారని కూనంనేని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లేసి రాష్ట్రాన్ని అప్పగిస్తే రూ.లక్ష కోట్లు పెట్టి నిర్మించిన ప్రాజెక్టుకు దిక్కు లేదన్నారు. అధికారులే వేల కోట్లు అవినీతి చేస్తే, వారికి పైవాళ్లు ఎంత అవినీతికి పాల్పడి ఉంటారోనని చెప్పాల్సిన పనిలేదన్నారు. సీపీఐ మాత్రమే ప్రజాపక్షాన పని చేస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి, జిల్లా కార్యదర్శి దశరత్, ఇతర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.