అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (SRO) అవినీతి రాజ్యమేలుతోంది. కార్యాలయ సిబ్బంది డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వసూళ్లు చేపడుతున్నారు. చాలా ఆఫీసుల్లో చేయి తడపనిదే పని కావడం లేదు. నేరుగా వెళ్తే పట్టించుకునే వారు ఉండరు.
అదే డాక్యుమెంట్ రైటర్(Document writer)ను వెంట పెట్టుకొని వెళ్తే.. ఆయన చెప్పిన డబ్బులు ఇస్తే ఇట్టే పని అయిపోతుంది. ఏసీబీ అధికారులు(ACB Officers) గురువారం మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాడులు చేశారు. నల్గొండ జిల్లా బీబీనగర్, మెదక్ జిల్లా సదాశివపేట్, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అధికారులు ఆకస్మికంగా సోదాలు చేశారు. ఈ సందర్భంగా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
ACB Raids | ఇష్టారీతిన రికార్డుల నిర్వహణ
బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు (Bibinagar Sub Registrar Office)లో తనిఖీల సమయంలో ఏసీబీ అధికారులు లెక్కలో చూపని రూ. 61,430 నగదు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ ప్రాంగణంలో 12 మంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేగాకుండా 93 రిజిస్టర్డ్ పత్రాలు SRO సిబ్బంది కస్టడీలో ఉన్నాయి.
జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు(SRO)లో సోదాల సమయంలో లెక్కల్లో చూపని రూ.30,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ ప్రాంగణంలో 11 మంది ప్రైవేట్ ఏజెంట్లు (Private Agents), డాక్యుమెంట్ రైటర్లు దొరికారు. 20 రిజిస్టర్డ్ పత్రాలు ఎస్ఆర్వో సిబ్బంది అదుపులో ఉన్నాయి. అంతేగాకుండా అనేక రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని ఏసీబీ అధికారులు గుర్తించారు.
సదాశివపేట(Sadashivpeta)లోని జరిగిన తనిఖీలో లెక్కల్లో లేని రూ.5,550 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆఫీస్ ఆవరణలో 9 మంది ప్రైవేట్ ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు ఉన్నట్లు గుర్తించారు. 39 రిజిస్టర్డ్ పత్రాలు పంపకుండా సిబ్బంది తమ వద్ద ఉంచుకున్నారు. ఇక్కడ ప్రభుత్వ రిజిస్టర్లు నిర్వహించడం లేదు. అనేక ఇతర అవకతవకలు కూడా గుర్తించిన అధికారులు నివేదికను ప్రభుత్వానికి పంపుతామన్నారు.
ACB Raids | అవినీతి కేంద్రాలుగా..
రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు (Sub Registrar Offices) అవినీతి కేంద్రాలుగా మారాయి. కొందరు అధికారులు దళారులు, కబ్జాదారులతో కుమ్మక్కై రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్(Fake Family Member Certificate), నకిలీ డెత్ సర్టిఫికెట్(Fake Death Certificate)తో సైతం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
గతంలో వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకే రోజు రాత్రి 99 రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ ఘటనపై మంత్రి పొంగులేటి(Minister Ponguleti) తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల చేసుకుంటున్నాయి. దీంతో తాజాగా ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ACB Raids | ఏసీబీ దూకుడు.. వారిలో గుబులు
ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. వరుస దాడులు చేపడుతుండడంతో అవినీతి అధికారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం కామారెడ్డి జిల్లాలోని ఆర్టీఏ చెక్పోస్టుతో పాటు మహబూబాబాద్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. గురువారం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సోదాలు చేపట్టారు. అయితే దాడులతో ఆందోళన చెందుతున్న అవినీతి అధికారులు.. లంచాలు తీసుకోవడం మాత్రం మానడం లేదు.