అక్షరటుడే, ఇందూరు : corrupt revenue inspector | అవినీతికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఆ ప్రభుత్వ ఉద్యోగి.. గతంలో ఒకసారి ఏసీబీకి చిక్కాడు. ఓ వైపు కేసు కొనసాగుతూనే ఉంది.
అయినా తన వక్ర బుద్ధిలో మార్పు రాలేదు. మళ్లీ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నిజామాబాద్ మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది.
నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్లో వీఎల్టీ ఫైల్ ప్రాసెస్ చేయడం కోసం లంచం తీసుకుంటూ.. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు.
మున్సిపల్ కార్పొరేషన్లో (Municipality) సీనియర్ అసిస్టెంట్, ఇన్ఛార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కర్ణ శ్రీనివాస్రావు వీఎల్టీ ఫైల్ను ప్రాసెస్ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడు.
దరఖాస్తుదారుడి నుంచి రూ.10 వేలు డిమాండ్ చేసిన కర్ణ శ్రీనివాస్రావు చివరకు రూ.7 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. దీంతో బాధితుడు ఏసీబీ (ACB) అధికారులకు సమాచారం అందించాడు.
ఈ క్రమంలో బుధవారం (సెప్టెంబరు 3) ఆర్ఐ లంచం తీసుకుంటుండుగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి, కేసు ఫైల్ చేశారు.
corrupt revenue inspector | అవినీతి కేంద్రాలుగా..
రాష్ట్రంలోని పలు మున్సిపల్ ఆఫీస్లు అవినీతి కేంద్రాలుగా మారాయి. పనుల కోసం వచ్చే ప్రజలను లంచాల కోసం అధికారులు వేధిస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారు.
నిత్యం ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా.. లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు. కొందరు అధికారులు అయితే ఏకంగా ఏజెంట్లను పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు.
తాజాగా ఏసీబీకి చిక్కిన అధికారి గతంలో అవినీతికి పాల్పడుతూ పట్టుబడినప్పుడే ఉన్నతాధికారులు తగు విధంగా శాఖాపరమైన శిక్ష విధిస్తే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఉన్నతాధికారులు “మామూలు”గా తీసుకోవడంతో ఈ అవినీతి చేప రెచ్చిపోయాడు.
ఏసీబీ కేసు ఉన్నా ప్రమోషన్ అందుకుని రెవెన్యూ ఇన్స్పెక్టర్ హోదా పొందాడు. కుక్క తోక వంకర అన్నట్లు మళ్లీ తన అవినీతి బుద్ధి పోనిచ్చుకోకుండా.. లంచాలకు ఎగబడ్డాడు. అవినీతి శృతి మించి మళ్లీ ఏసీబీకి పట్టుబడ్డాడు.
corrupt revenue inspector | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు.
1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.
ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు.
ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అభయం ఇస్తున్నారు.