అక్షరటుడే, నిజాంసాగర్ : Nizam Sagar | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు(Nizam Sagar Project)కు ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఎగువన గల సింగూరు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తుండడంతో వరద నీరు వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ జలాశయంలోకి ప్రస్తుతం 2254 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో(Inflow)గా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1393.33 అడుగుల (5.76 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
Nizam Sagar | కళ్యాణి రిజర్వాయర్లోకి..
ఇక నిజాంసాగర్ ఆయకట్టుకు అనుసంధానంగా నిర్మించిన కళ్యాణి రిజర్వాయర్(Kalyani Reservoir)లోకి 230 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటిమట్టం 409.50 మీటర్లకు గాను 408.50 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. అలాగే సింగితం రిజర్వాయర్లో 416.554 మీటర్లకు గాను 415.504 మీటర్ల మేర నీరు ఉంది.
Nizam Sagar | సింగూరు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన గల సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. మంజీర పరీవాహక ప్రాంతంలోని సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తుండడంతో ఒక వరద గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. ఈ ప్రాజెక్టులో గురువారం సాయంత్రానికి 523.600 మీటర్లకు (29.917 టీఎంసీలు) గాను 522.110 మీటర్లు (22.145 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 2,941 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో 11 నంబర్ గేటు ద్వారా 10,719 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేస్తున్నారు.