అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్సాగర్ (SRSP) ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో 38 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీరామ్సాగర్లోకి వారం రోజులుగా భారీ వరద వస్తోంది. దీంతో అధికారులు దిగువకు నీటి విడుదల పెంచారు. ప్రస్తుతం వర్షాలు, ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గడంతో గోదావరిలోకి (Godavari) నీటి విడుదలను తగ్గించారు. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతోంది.
Sriram Sagar | 67 టీఎంసీలకు నీటిమట్టం
శ్రీరామ్ సాగర్లోకి ప్రస్తుతం 4.50 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 38 వరద గేట్ల ద్వారా 3.25 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్ ఫ్లో 3,56,853 క్యూసెక్కులుగా ఉంది. నిన్నటి వరకు ఇన్ఫ్లో కంటే ఔట్ ఫ్లో ఎక్కువ ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం తగ్గింది. ఎగువన వర్షాలు తగ్గడంతో ప్రస్తుతం గోదావరిలోకి నీటి విడుదల తగ్గించారు. దీంతో జలాశయంలో నీటిమట్టం 67.3 టీఎంసీలకు చేరింది.
Sriram Sagar | కాల్వల ద్వారా..
ఎస్సారెస్పీ నుంచి ఎస్కేప్ గేట్ల ద్వారా 3500 క్యూసెక్యులు, వరద కాలువ (Flood Canal)కు 18వేలు, కాకతీయ కాలువకు 4,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథకు 231క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 622 క్యూసెక్కుల నీరు పోతోంది. సరస్వతి, లక్ష్మి కాలువతో పాటు అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలను నిలిపివేశారు.
Sriram Sagar | నది సమీపంలోకి వెళ్లొద్దు
శ్రీరామ్సాగర్ నుంచి గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతున్నందున ప్రజలు నది సమీపంలోకి వెళ్లొద్దని ప్రాజెక్ట్ ఏఈఈ కొత్త రవి సూచించారు. నదిలో, కాల్వల్లో చేపల వేటకు వెళ్లొదన్నారు. నది సమీపంలో పొలాలు గల రైతులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పైనుంచి వరద పెరిగితే నీటి విడుదల పెంచే అవకాశం ఉందన్నారు.