అక్షరటుడే, వెబ్డెస్క్: Constable Suspension | ఓ కానిస్టేబుల్ భార్య మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) పోటీ చేస్తున్నారు. ఆమె తరఫున భర్త ప్రచారం చేసినట్లు తేలడంతో అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదనే నిబంధన ఉంది.
అయినా కూడా పలువురు ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులను ఎన్నికల బరిలో నిలిపి, వారి తరఫున ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) కొమురవెల్లి ఠాణా (Komuravelli Police Station)లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కె రమేశ్ భార్య గీతాంజలి చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రెండో వార్డు నుంచి ఆమె బీఆర్ఎస్ అభ్యర్థిగా (BRS Candidate) బరిలో దిగారు. అయితే కానిస్టేబుల్ రమేశ్ను సస్పెండ్ చేస్తూ తాజాగా పోలీసు కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Constable Suspension | ప్రచారంలో పాల్గొన్నట్లు తేలడంతో..
రమేశ్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు పోలీసు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేసినట్లు సీపీ తెలిపారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడమే కాకుండా.. తన భార్యకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలతో సహా తేలడంతో వేటు వేశామన్నారు. అయితే తన భర్తను సస్పెండ్ చేయడంపై గీతాంజలి నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి, కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేశారు. ఓటమి భయంతోనే తన భర్తను సస్పెండ్ చేయించారని ఆరోపించారు. తన భర్త ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని ఆమె చెప్పారు. కాంగ్రెస్ నాయకుల (Congress Leaders) కక్షపూరిత చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.