అక్షరటుడే, వెబ్డెస్క్ : దేశ రాజధానిలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఒకరిని, సౌత్ ఢిల్లీలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఐఈడీ బాంబులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
ఢిల్లీలోని సాదిక్ నగర్, మధ్యప్రదేశ్లోని భోపాల్లలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరికి ఐసిస్ ఉగ్రవాద సంస్థ (ISIS Terrorist Organization)తో సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. ఢిల్లీలో ఒక పెద్ద ఉగ్రవాద దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల్లో ఒకరిని అద్నాన్గా పోలీసులు గుర్తించారు.
Delhi | కొనసాగుతున్న విచారణ
అనుమానితుల నెట్వర్క్, వారి ప్రణాళికల పరిధిని తెలుసుకోవడానికి నిందితులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి అరెస్ట్తో ఢిల్లీలో ఉగ్రకుట్రను భగ్నం చేశామని చెప్పారు. అదనపు కమిషనర్ ప్రమోద్ కుష్వాహా (Pramod Kushwaha), ఏసీపీ లలిత్ మోహన్ నేగి నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్ నిర్వహించిందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. వీరికి పాకిస్థాన్ ఐఎస్ఐ (Pakistan ISI)తో సంబంధాలు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
Delhi | రద్దీగా ఉండే ప్రాంతంలో..
ఇద్దరు నిందితులు ఢిల్లీలోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు చేయాలని ప్లాన్ చేశారు. ప్రణాళికాబద్ధమైన దాడులను అమలు చేయడానికి వారు శిక్షణ పొందారని పోలీసులు పేర్కొన్నారు. వారికి ఇతర దేశాల నుంచి ఆదేశాలు వస్తున్నట్లు గుర్తించామన్నారు. గత నెలలో స్పెషల్ సెల్ ఢిల్లీ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణకు చెందిన ఐదుగురు వ్యక్తులను ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధాలున్నాయని అరెస్ట్ చేసింది.

