అక్షరటుడే, వెబ్డెస్క్: Tamil Nadu | తమిళనాడులో ఇంధనం లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలు (goods train) అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.
కాగా.. ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగిన వంద మీటర్ల దూరంలో రైలు పట్టాలు విరిగి ఉండడాన్ని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. రైల్వే అధికారులు (Railway officials), పోలీసులు విచారణ చేపడుతున్నారు.
తమిళనాడులో (Tamil Nadu) ఆదివారం తెల్లవారుజామున ఇంధనం లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలులో (Goods Train) ఒక్కసారిగా మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. తిరువళ్లూరు సమీపంలో రైలు పట్టాలు తప్పటంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఐదు వ్యాగన్లకు వ్యాపించాయి. ఈ రైలులో మొత్తం 52 వ్యాగన్లు ఉండగా.. 5 వ్యాగన్లు కాలిబూడిద అయిపోయాయి. మిగిలిన వ్యాగన్లను అధికారులు సురక్షితంగా తరలించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Tamil Nadu | కొనసాగుతున్న సహాయక చర్యలు
చెన్నై ఓడరేవు (Chennai port) నుంచి ఆయిల్ తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కో వ్యాగన్లో 70 వేల లీటర్ల ఆయిల్ ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతం అంతా పొగ అలుముకుంది. మంటలను అదుపులోకి తెచ్చిన అధికారులు సహాయక చర్యలు ఇంకా చేపడుతున్నారు.
ఆ ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరించడంతో పాటు వ్యాగన్ల శిథిలాలను తొలగిస్తున్నారు. మరోవైపు మంటలకు విద్యుత్ లైన్లు తెగిపోవడంతో మరమ్మతులు చేస్తున్నారు. అయితే ప్రమాద స్థలం నుంచి వంద మీటర్ల దూరంలో ట్రాక్ విరిగి ఉండడాన్ని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో సైతం దర్యాప్తు చేస్తున్నారు.