అక్షరటుడే, భీమ్గల్: Prashanth Reddy campaign | కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలతో భీమ్గల్ మున్సిపాలిటీ (Bheemgal municipality) అభివృద్ధిని అడ్డుకుంటోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 2, 4, 8 వార్డుల్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లలో ఆయన మాట్లాడారు.
Prashanth Reddy campaign | నిధులున్నా పనులు చేయరా?
తాను మంత్రిగా ఉన్న సమయంలో 2023 ఆగస్టులో భీమ్గల్ అభివృద్ధి కోసం రూ.10కోట్లు మంజూరు చేశానని, కలెక్టర్ ద్వారా వర్క్ ఆర్డర్లు కూడా వచ్చాయని వేముల గుర్తు చేశారు. ‘ముఖ్యంగా 4, 5, 6, 9, 12 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల కోసం రూ.2 కోట్లు కేటాయించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) వచ్చాక ఆ పనులను రెండేళ్లుగా నిలిపివేసి ప్రజలను ఇబ్బంది పెడుతోంది’ అని విమర్శించారు. రూ.40 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి 80 శాతం పనులు పూర్తయినా, మిగిలిన పనులను పూర్తి చేయకుండా ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు.
Prashanth Reddy campaign | హామీల అమలులో విఫలం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి 25 నెలలవుతున్నా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఈ లెక్కన ప్రతి మహిళకు ప్రభుత్వం రూ.62,500 బాకీ పడిందన్నారు. తులం బంగారం, రూ.4000 పెన్షన్, రైతు భరోసా హామీలన్నీ అటకెక్కాయి అని ఎద్దేవా చేశారు.
Prashanth Reddy campaign | బీఆర్ఎస్ను గెలిపించండి..
బీజేపీకి ఓటు వేసి ఓటును వృథా చేసుకోవద్దని, తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి పైసా నిధులు తీసుకురాలేదని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులు లక్ష్మి భగత్, పద్మ దశరథ్, పర్స నవీన్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ గెలుపుతోనే ప్రభుత్వానికి భయం పుట్టి హామీలు అమలు చేస్తారని ఆయన పేర్కొన్నారు.
1 comment
[…] […]
Comments are closed.