అక్షరటుడే, వెబ్డెస్క్ : Congress | టీపీసీసీ (TPCC) క్రమశిక్షణ కమిటీ సమావేశం ఆదివారం గాంధీ భవన్లో నిర్వహించారు. ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన పెండింగ్ వివాదాలపై చర్చించారు.
వరంగల్ కాంగ్రెస్ (Warangal Congress)లో విభేదాలు మళ్లీ రాజుకున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా వరంగల్లో మంత్రి కొండా సురేఖకు మిగతా ఎమ్మెల్యేలకు పాడటం లేదు. వర్గపోరు నేపథ్యంలో గతంలో క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించింది. అనంతరం వివాదాల పరిష్కారానికి కమిటీ వేసింది. తాజాగా మరోసారి వరంగల్ రాజకీయాలపై కమిటీలో చర్చించారు.
Congress | ఫిర్యాదు అందలేదు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Rajagopal Reddy) కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో సీఎం లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. అయినా ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తాజాగా క్రమ శిక్షణ కమిటీ సమావేశంలో ఆయన గురించి చర్చించలేదని ఛైర్మన్ మల్లు రవి తెలిపారు. రాజగోపాల్ రెడ్డిపై ఫిర్యాదు రాలేదని, పీసీసీ కూడా చెప్పకపోవడంతో చర్చించలేదని స్పష్టం చేశారు. అయితే గతంలోనే ఆయన వ్యవహారంపై చర్చించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ క్రమశిక్షణ కమిటీకి సూచించారు. అయినా కూడా ఆయనపై చర్యలు తీసుకోవడానికి పార్టీ ఆలోచిస్తుండటం గమనార్హం.
Congress | సంయమనం పాటించాలి
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) జరగనున్నాయని మల్లు రవి తెలిపారు. నేతలు అంతా సంయమనం పాటించాలని సూచించారు. విబేధాలను పక్కన పెట్టి అందరు కలిసి పార్టీ గెలుపు కోసం పని చేయాలన్నారు.
Congress | వివరణ ఇచ్చిన నర్సారెడ్డి
క్రమశిక్షణ కమిటీతో సిద్దిపేట (Siddipet) కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల గజ్వేల్లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నర్సారెడ్డిపై పలువురు నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో క్రమశిక్షణ కమిటీ నోటీసులు అందించింది. ఈ మేరకు ఆయన ఆదివారం వివరణ ఇచ్చారు. తాను ఎవరిని కించపర్చలేదని, దళితుల సహకారంతోనే ఎదిగానని నర్సారెడ్డి తెలిపారు. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.