HomeతెలంగాణMP Laxman | బీసీల‌ను మోసం చేస్తున్న కాంగ్రెస్‌.. రేవంత్ స‌ర్కారుపై ఎంపీ ల‌క్ష్మ‌ణ్ ధ్వ‌జం

MP Laxman | బీసీల‌ను మోసం చేస్తున్న కాంగ్రెస్‌.. రేవంత్ స‌ర్కారుపై ఎంపీ ల‌క్ష్మ‌ణ్ ధ్వ‌జం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:MP Laxman | బీసీ రిజ‌ర్వేష‌న్ల పేరిట కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress Government) నాట‌కాలాడుతోంద‌ని బీజేపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు కే.ల‌క్ష్మ‌ణ్ విమ‌ర్శించారు. శ‌నివారం ఆయ‌న ఢిల్లీలో విలేక‌రుల‌తో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీసీ బిల్లు రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద పెండింగ్‌లో ఉండ‌గా, రిజర్వేష‌న్లు పెంచుతూ ప్ర‌భుత్వం తెచ్చే ఆర్డినెన్స్‌పై గ‌వ‌ర్న‌ర్ సంత‌కం పెడ‌తారా? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) పంపించిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆ బిల్లుపై ఏమి తేల్చకుండా ఆర్డినెన్స్ తీసుకురావడంలో ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి పూర్తి స్వేచ్ఛ ఆయా రాష్ట్రాలకు ఉందని నొక్కిచెప్పారు. అయిన‌ప్ప‌టికీ, ఆర్డినెన్స్ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కావాల‌నే బీసీల‌ను మరోసారి మోసం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ సర్కార్‌కి కనీస ఇంగిత జ్ఞానం లేదని, బీసీల జీవితాలతో చెలగాటం ఆడుతూ వారిని రాజకీయాస్త్రాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP Laxman | దాగుడుమూత‌లెందుకు?

బీసీల‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి లేదని ల‌క్ష్మ‌ణ్(MP Laxman) విమ‌ర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వివిధ కులాలకు సంబంధించిన ప్రామాణిక గణాంకాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు నిర్ణీత ప‌ద్ధ‌తి ఉంటుంద‌ని, కానీ అదేది ప‌ట్టించుకోకుండా రేవంత్ ప్ర‌భుత్వం బీసీల‌ను ఏమార్చేందుకు య‌త్నిస్తోంద‌న్నారు. రిజర్వేషన్లలో(BC Reservations) వివిధ కులాలకు సంబంధించిన గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు. రిజర్వేషన్లు కల్పించేందుకు ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏ కులానికి సంబంధించిన జనాభా ఎంత ఉందో లెక్కలు తేలిస్తే న్యాయస్థానాల్లో వాదన నిలబడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. కులాలకు సంబంధించిన జనాభా ప్రామాణిక గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం(State Government) విడుదల చేస్తే కోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాదన నిలబడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బుర్ర వెంకటేశం ఆధ్వర్యంలో కమిషన్ బాధ్యతలను ఎందుకు సరిగ్గా నిర్వర్తించలేదన్నారు.

MP Laxman | 50 శాతం కోటా మించొద్దు క‌దా..

సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం 50 శాతం దాటొద్ద‌ని, మ‌రీ రేవంత్ స‌ర్కారు బీసీల‌కు ఏ విధంగా 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తుంద‌ని ల‌క్ష్మ‌ణ్ ప్ర‌శ్నించారు. 2021లో వికాస్ కిషన్‌రావు వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులో స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court) మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్ కేటాయించినప్పుడు 50 శాతానికి మించకూడదనే నిబంధనను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాటించిందా? అని నిలదీశారు. గ‌తంలో బీఆర్ఎస్‌, వైఎస్సార్ కాంగ్రెస్ రిజర్వేషన్ల పేరుతో బీసీలను వంచించాయని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా బీసీలను దగా చేసి ఓట్లు దండుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో(Kamareddy Declaration) ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలపెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీ డిక్లరేషన్‌కు సంబంధించిన కనీస ప్రస్తావన ఎందుకు చేయలేదని నిలదీశారు.సెప్టెంబర్‌లోపు బీసీ రిజర్వేషన్లను తేల్చాలని తెలంగాణ హై కోర్టు(Telangana High Court) ఆదేశించిందని.. కాబట్టే ఎన్నికలు త్వరగా నిర్వహించి మరోసారి బీసీలని మోసం చేయడానికి రేవంత్‌రెడ్డి సర్కార్ సిద్ధమవుతోందని విమర్శించారు.