అక్షరటుడే, వెబ్డెస్క్ : KCR | జూబ్లీహిల్స్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం ఉప ఎన్నికలపై ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్లో కీలక సమావేశం నిర్వహించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ఇన్ఛార్జీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రౌడీ షీటర్కు టికెట్ ఇచ్చిందన్నారు. రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని ఆయన కోరారు.
KCR | బీఆర్ఎస్దే గెలుపు
జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే మాగంటి సునీతను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ రౌడీ షీటర్ను పోటీలో ఉంచడం.. విద్యావంతులైన, శాంతిని ప్రేమించే పౌరులకు అవమానకరమని ఆయన విమర్శించారు. ఓటర్లు ఇలాంటి రాజకీయాలను నిర్ణయాత్మకంగా తిరస్కరించి హైదరాబాద్ గౌరవాన్ని, శాంతిభద్రతలను కాపాడతారన్నారు.
KCR | కాంగ్రెస్ వైఫల్యాలను వివరించాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, మోసం ద్వారా రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కేసీఆర్ సూచించారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డును నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పంచాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత తదితరులు పాల్గొన్నారు.
