అక్షరటుడే, వెబ్డెస్క్ : Congress Party | కాంగ్రెస్ పార్టీ కేరళ విభాగం చేసిన ఓ పోస్టు కొత్త వివాదాన్ని రాజేసింది. బీహార్ రాష్ట్రం పేరుతో పాటు బీడీ కూడా బీ అనే అక్షరంతోనే మొదలవుతాయని చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ కేరళ యూనిట్(Kerala Unit) చేసిన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ రాజకీయ తుఫానుకు దారితీసింది.
బీహార్ ఎన్నికలకు(Bihar Elections) కీలకంగా భావిస్తున్న ఆ పార్టీ అధినాయకత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది. బీడీలపై కేంద్రం వస్తువు సేవల పన్ను (GST)ను తగ్గించడాన్ని బీహార్ ఎన్నికలతో ముడిపెడుతూ చేసిన పోస్టు సరికొత్త వివాదానికి కేంద్రంగా మారింది. సిగార్లు, సిగరెట్లు, బీడీలు, పొగాకుపై సవరించిన GST రేట్ల వివరాలను షేర్ చేస్తూ “బీడీలు, బీహార్ B తో ప్రారంభమవుతాయి. ఇకపై అవి పాపంగా పరిగణించబడవు” అని కాంగ్రెస్ కేరళ యూనిట్ పోస్టు చేసింది.
Congress Party | హద్దు దాటిన కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ(Congress Party)కేరళ విభాగం చేసిన ఈ పోస్టు ప్రత్యర్థులకు మంచి ఆయుధంగా మారింది. కాంగ్రెస్ మరోసారి హద్దులు దాటిందని బీజేపీ మండిపడింది. కేరళ కాంగ్రెస్ యూనిట్ తన X హ్యాండిల్లో తొలగించిన వివాదాస్పద పోస్ట్ను తిరిగి షేర్ చేసిన బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా(Shehzad Poonawalla).. కాంగ్రెస్ సరిహద్దును దాటిందని ఆరోపించారు. “ప్రధాని నరేంద్ర మోదీ జీ తల్లిని దుర్భాషలాడిన తర్వాత ఇప్పుడు బీహార్ను బీడీతో పోలుస్తున్నారు! తేజశ్వి యాదవ్ దీనిని ఆమోదిస్తున్నారా?” అని ఆయన ప్రశ్నించారు. “రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నుంచి మొదలు డీఎంకే వరకు.. ఇప్పుడు కాంగ్రెస్ వరకు – బీహార్ పట్ల వారి ద్వేషం స్పష్టంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ఈ ఉదంతంపై స్పందించిన బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి(BJP leader Samrat Chaudhary) ఇది మొత్తం బీహార్కు అవమానమని అభివర్ణించారు. “మొదట మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవనీయ తల్లిని అవమానించారు. ఇప్పుడు మొత్తం బీహార్ ప్రజలను అవమానించారు. ఇది కాంగ్రెస్ వాస్తవమైన లక్షణం” అని X లో విమర్శించారు. కాంగ్రెస్ చర్య పూర్తిగా సిగ్గుచేటని జనతాదళ్ యునైటెడ్ నాయకుడు సంజయ్ కుమార్ ఝా(Sanjay Kumar Jha) మండిపడ్డారు. “బీ అంటే బీడీ అని మాత్రమే కాదు, బుద్ధి (తెలివి) అని కూడా నేను మీకు చెప్తాను, అది మీకు లేదు. బీ అంటే బడ్జెట్ కూడా, బీహార్కు ప్రత్యేక సహాయం పొందినప్పుడు మీరు అసూయపడేలా చేస్తుంది” అని ఆయన విమర్శించారు. బీహార్ను ఎగతాళి చేయడం ద్వారా కాంగ్రెస్ మరోసారి బీహార్ ప్రజలను అవమానించడమే కాకుండా దేశ అద్భుతమైన చరిత్ర, ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం చేసిందన్నారు.