అక్షరటుడే, ఆర్మూర్: Collector Nizamabad | మాక్లూర్ (Makloor) కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) గురువారం తనిఖీ చేశారు. అనంతరం గొట్టిముక్కలలో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
ముందుగా కేజీబీవీ (KGBV) స్కూల్ను సందర్శించి, స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్రూంలో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపర్చిన వాటికి అనుగుణంగానే ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఉడకబెట్టిన కోడిగుడ్లు, నిర్ణీత రోజుల్లో మాంసాహారం, అరటి పండ్లు అందిస్తున్నారా అని ఆరా తీశారు.
సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. బాలికలకు ఏకరూప దుస్తులు, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, ఇతర మెటీరియల్ పంపిణీ జరిగిందా అని వాకబు చేశారు. భోజనం తయారు చేసేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, సరుకులు, కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కాగా.. పాఠశాలలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయించాలని ఏఈ ఉదయ్ కిరణ్కు సూచించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ శేఖర్, పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి తదితరులున్నారు

