అక్షరటుడే ఇందల్వాయి: Collector Nizamabad | డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy ) శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలలోని స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, కోడి గుడ్లు, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని (midday meal) పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు.
భోజనం వండడానికి ముందే ఆహార పదార్థాల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, కాలం చెల్లిన పదార్థాలు వినియోగించకూడదని సూచించారు. నాసిరకమైన బియ్యం, నూనె, ఇతర సరుకులు సరఫరా జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తేవాలని, వాటి స్థానంలో నాణ్యమైన సరుకులను సమకూర్చేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ సతీష్, పాఠశాల ప్రిన్సిపాల్ నరేందర్, స్థానిక అధికారులు ఉన్నారు.
