అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | ఎడపల్లి మండలం కుర్నాపల్లి (Kurnapalli Village) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా ఉన్న పల్లె దవాఖానాను, సహకార సంఘం ఎరువుల గోడౌన్ను సందర్శించారు. ముందుగా పల్లె దవాఖానాను కలెక్టర్ తనిఖీ చేసి నిర్వహణ తీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు, అవుట్ పేషెంట్ల రిజిస్టర్లను తనిఖీ చేశారు.
టీబీ ముక్త్ భారత్ అభియాన్ (TB Mukt Bharat Abhiyan) అమలుతో పాటు సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. గ్రామంలో ఇతర ప్రాంతం నుండి వచ్చిన ఒకరికి డెంగీ వచ్చిందని ఆరోగ్య కార్యకర్త శైలజ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దోమల నివారణ కోసం స్ప్రే, ఫాగింగ్ చేయించడం లేదని వెల్లడి కావడంతో గ్రామ కార్యదర్శి సురేష్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నెలన్నర రోజుల నుండి పదేపదే చెబుతున్నప్పటికీ, ఇంతవరకు స్ప్రే ఎందుకు చేయించలేదని నిలదీశారు.
Collector Nizamabad | పంచాయతీ అధికారికి ఆదేశాలు..
అక్కడినుండే జిల్లా పంచాయతీ అధికారికి (District Panchayat Officer) ఫోన్ చేసి, అన్ని జీపీల్లో పక్కాగా ఫాగింగ్ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో గ్రామం వారీగా పరిశీలన జరిపించి, నివేదిక సమర్పించాలని సూచించారు. ప్రతి పక్షం రోజులకు ఒకసారి తప్పనిసరిగా అన్ని నివాస ప్రదేశాల్లో ఫాగింగ్ చేయించాలని, ఫ్రైడే-డ్రైడే పక్కాగా అమలయ్యేలా చూడాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు.
Collector Nizamabad | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై..
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు (Indiramma house sanctions) పొందిన లబ్ధిదారులు అందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.లక్ష వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) ఇందిరమ్మ లబ్దిదారులకు ఇప్పటికే రూ. 30 కోట్ల పైచిలుకు రుణ సదుపాయం అందించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. అవసరమైతే మరిన్ని రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 5లక్షల ఆర్థికసాయం అందిస్తుండగా, ఉచిత ఇసుకను సమకూరుస్తున్నామని గుర్తు చేశారు. అయినప్పటికీ లబ్ధిదారులు ముందుకు రాకపోతే వారి నుంచి లిఖితపూర్వకంగా లెటర్ తీసుకుని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలన్నారు.
ఎంపీడీవో ఆఫీసులో ప్రజాపాలన సేవా కేంద్రం కొనసాగుతున్న విషయం ప్రజలందరికి తెలిసేలా కార్యాలయం వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయించాలని సూచించారు. కాగా, ఎరువుల గోడౌన్ను (fertilizer godown) తనిఖీ చేసిన కలెక్టర్, ఎరువుల నిల్వలను పరిశీలించారు. అక్కడికి వచ్చిన స్థానిక రైతులను పలకరించి, ఎరువులు సరిపడా అందుతున్నాయా అని ఆరా తీశారు. ఎరువుల పంపిణీ సంతృప్తికరంగా ఉందని, తమ అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్నాయని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ.. జిల్లాలో 11 వేల మెట్రిక్ టన్నుల వరకు ఎరువుల నిల్వలు మిగిలి ఉండగానే, కొత్తగా ఎరువుల స్టాక్ తెప్పించుకోవడం జరుగుతుందన్నారు. అన్ని ప్రాంతాలలో ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకున్న ఫలితంగా కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వానాకాలం సీజన్ పంటకు (monsoon season crop) సంబంధించి ఇప్పటికే రెండు దఫాలుగా ఎరువుల వాడకం పూర్తయ్యిందని, చివరిదైన మూడవ దఫా వినియోగం సజావుగా సాగుతోందని గుర్తు చేశారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.