అక్షరటుడే, ఆర్మూర్ : Collector Nizamabad | ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) వైద్యాధికారులను ఆదేశించారు.
సాధారణ చికిత్సలతో పాటు గర్భిణులకు స్థానికంగానే ప్రసవాలు కూడా చేయాలని అన్నారు. డొంకేశ్వర్ (Donkeshwar) మండల కేంద్రంలో కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, సహకార సంఘం ఎరువుల గోడౌన్, ఎంపీడీవో కార్యాలయాలను (MPDO Office) సందర్శించారు. ముందుగా పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్.. ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరును పరిశీలించారు. పీహెచ్సీతో పాటు దీని పరిధిలోని ఆరు హెల్త్ సబ్ సెంటర్ల (Health Sub Centers) ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వ్యాక్సినేషన్, టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాల అమలు, ఏఎన్సీ చెకప్లు గ్రామాల్లో ఆరోగ్య శిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాల అమలు గురించి ఆరా తీశారు. సుశిక్షితులైన స్టాఫ్నర్స్ (Staff Nurse) ఉన్నప్పటికీ స్థానికంగా కాన్పులు ఎందుకు చేయడం లేదని కలెక్టర్ ప్రశ్నించారు.
ప్రతినెలా కనీసం రెండు కాన్పులు స్థానికంగా జరిగేలా కృషి చేయాలని, గర్భిణులకు స్థానిక పీహెచ్సీలో డెలివరీ చేసే సదుపాయం అందుబాటులో ఉందని ఏఎన్ఎంలు, ఆశాల ద్వారా వివిధ సమావేశాలలో మహిళలకు అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శుభాంకర్కు (Medical Officer Dr. Subhankar) సూచించారు. పీహెచ్సీ పనితీరు చక్కగా ఉందని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
Collector Nizamabad | మధ్యాహ్న భోజనం తనిఖీ..
కలెక్టర్ జెడ్పీ హైస్కూల్(ZP High School), ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్, సాబేర బేగంను ఆదేశించారు. విద్యార్థులు ముఖ హాజరు నమోదును పరిశీలించగా, పలువురు విద్యార్థులు హాజరును ఎఫ్ఆర్ఎస్ ద్వారా నమోదు చేయకపోవడాన్ని గమనించారు. ఎందుకు పర్యవేక్షణ చేయడం లేదని ఎంఈవో రామకృష్ణపై ఫోన్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన ఊరు–మన బడి కింద నూతనంగా నిర్మించిన తరగతి గదుల గోడలపై పెయింటింగ్స్ వేయించాలని సూచించారు. ఇంకా ఏమైనా సదుపాయాలు అవసరం ఉంటే, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న క్రీడా పరికరాల గురించి ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ సహకార సంఘం ఎరువుల సేల్ పాయింట్ను (Fertilizer Sales Point) సందర్శించి, అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని, మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై స్థానిక అధికారులతో సమీక్ష జరిపారు.
Collector Nizamabad | ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియా సందర్శన
చిన్నయానాం శివారులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ (Sriramsagar Project Backwater) ఏరియాను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి పర్యాటకులు ఈ ప్రదేశానికి వస్తుండడాన్ని గమనించిన కలెక్టర్, ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ డీఈ రవికి (Irrigation DE Ravi) సూచించారు. పరీవాహక ప్రాంతాల ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. బ్యాక్ వాటర్ ఏరియాను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రతిపాదనల గురించి అడిగి తెలుసుకుని, అందుకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.