అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Restaurants | హైదరాబాద్ రెస్టారెంట్ల పరిశుభ్రతపై మరోసారి వివాదం చెలరేగింది. టేస్ట్ కోసం, సౌకర్యం కోసం రెస్టారెంట్లకు వెళ్లే ప్రజలు ఇప్పుడు భయంతో భోజనం చేసే పరిస్థితి నెలకొంది.
తాజాగా నానక్రామ్గూడలోని ‘కృతుంగ రెస్టారెంట్’లో రాగి సంకటిలో బొద్దింక కనిపించిన ఘటన సంచలనం రేపింది. ఇదే సమయంలో షాద్నగర్ జడ్చర్ల రోడ్డులోని డైమండ్ బావర్చి హోటల్(Diamond Bawarchi Hotel)లో పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్కు చికెన్ ముక్కలు వడ్డించడంతో మరో వివాదం తెరపైకి వచ్చింది.
Hyderabad Restaurants | ఆరోగ్యంపై ముప్పు..
వివరాలలోకి వెళితే నానక్రామ్గూడలోని కృతుంగ రెస్టారెంట్(Kritunga Restaurant)కు వెళ్లిన ఓ కస్టమర్ రాగి సంకటి ఆర్డర్ చేశారు. సగం తిన్న తర్వాత బొద్దింక కనిపించడంతో ఆయన ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, వారు నిర్లక్ష్యంగా స్పందించారనీ, దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్ పరిసరాలను పరిశీలించిన ఆయన, అక్కడి అపరిశుభ్రత, దుర్వాసనను వీడియో తీసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు(Food Safety Officers) ఫిర్యాదు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హోటల్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “బ్రాండ్ పేరుతో నోటికి రుచి, ఆరోగ్యానికి ముప్పు” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రెగ్యులర్ కస్టమర్లలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇక షాద్నగర్ జడ్చర్లలోని డైమండ్ బావర్చి హోటల్లో ఓ శాఖాహారి వ్యక్తి పన్నీర్ బిర్యానీ(Paneer Biryani) ఆర్డర్ చేయగా, అందులో చికెన్ ముక్కలు ఉన్నట్లు తేలింది. స్వయంగా శాఖాహారి అయిన అతను, భోజనం మధ్యలో చికెన్ తగలడంతో హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, వారు ఆయన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. “మీ ఇష్టం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి” అంటూ సమాధానం చెప్పారట. బాధితుడు సంబంధిత అధికారులను సంప్రదించి హోటల్పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కూడా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.