అక్షరటుడే, వెబ్డెస్క్: Coca Cola IPO | విదేశీ సంస్థలు దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల హ్యుందాయ్ (Hyundai), ఎల్జీలు లిస్టయిన విషయం తెలిసిందే. త్వరలోనే కోకాకోలా (Coca Cola) పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశాలున్నాయి.
ప్రముఖ శీతల పానీయాల తయారీ సంస్థ కోకాకోలా.. భారత్కు చెందిన తన బాటిలింగ్ యూనిట్ హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ (Hindustan CocaCola Beverages) ప్రైవేట్ లిమిటెడ్ను ఐపీవోకు (IPO) తీసుకు రావాలని భావిస్తోంది. మార్కెట్ నుంచి సుమారు రూ. 8 వేల కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఆ సంస్థ బ్యాంకర్లతో భేటీ అయినట్లు తెలుస్తోంది.
Coca Cola IPO | శీతల పానీయాల దిగ్గజం
అట్లాంటాకు (Atlanta) చెందిన శీతల పానీయాల దిగ్గజం కోకాకోలాకు భారత్ అతిపెద్ద మార్కెట్. బెంగళూరు (Bengalore) కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ లిమిటెడ్ విలువ 10 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలోని 236 జిల్లాల్లో 14 తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఈ సంస్థలో 5,200 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 20 లక్షల మంది రిటైలర్లు ఉన్నారు. ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూ (Public issue) ద్వారా ఒక బిలియన్ డాలర్లను సమీకరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పబ్లిక్ ఇష్యూకు సంబంధించిన చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఇటీవల కాలంలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ భారత అనుబంధ సంస్థలను స్టాక్ మార్కెట్లో (Stock Market) లిస్ట్ చేస్తున్నాయి. గతేడాది హ్యుందాయ్ 3.3 బిలియన్ డాలర్లతో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఎల్జీ ఎలక్ట్రానిక్స్ (LG Electronics) 1.3 బిలియన్ డాలర్లను సమీకరించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ జాబితాలో కోకాకోలా కూడా చేరే అవకాశాలు ఉన్నాయి.