అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy Tour | సీఎం రేవంత్ రెడ్డి గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటించనున్న వివిధ ప్రాంతాలను ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు.
తాడ్వాయి (Tadwai) మండలం ఎర్రపహాడ్ వద్ద సీఎం హెలీకాప్టర్ (CM Helicopter) దిగేందుకు ఏర్పాటుచేసిన హెలీపాడ్ను పరిశీలించారు. కామారెడ్డి ఆర్డీవో, తాడ్వాయి తహశీల్దార్లు దగ్గరుంచి అక్కడి పరిస్థితులను చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం లింగంపేట్ (lingampet) మండలంలో దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు వంతెనను పరిశీలించి సీఎం వచ్చే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకుండా చూడాలని ఆదేశించారు. వరద వల్ల వంతెనకు కలిగిన నష్టాన్ని సీఎంకు చూపించేలా బాధ్యతలు చూసుకోవాలని ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డికి (Yellareddy RDO Parthasimha Reddy) సూచించారు. లింగంపేట్ మండలం బుడిగిద్ద గ్రామంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి సీఎంకు జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలు తెలపాలని వ్యవసాయ అధికారులకు సూచనలు చేశారు.
అనంతరం కామరెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీలో (GR Colony) పర్యటించి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టరేట్లో సీఎం జిల్లా అధికారులతో నిర్వహించనున్న వరదలపై సమీక్ష, ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కార్యక్రమం సాఫీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కామారెడ్డి డివిజన్ ఏఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, మున్సిపాలిటీ, వ్యవసాయ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.